గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు మండవ సిద్ధం.. అదే బాటలో అన్నపూర్ణ?
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ సంస్థాగతంగా, నేతలు, కార్యకర్తల పరంగానూ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 2014కి ముందు తెలంగాణ పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన తీరు, 2015లో ఓటుకు నోటు కేసులో బహిరంగంగా పట్టుబడి విజయవాడకు తరలిపోయిన తర్వాత తెలంగాణలో పార్టీ గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.
రెండున్నరేళ్ల పాటు పార్టీలో హల్ చల్ చేసిన రేవంత్ రెడ్డితోపాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీకి, ఇంకొందరు టీడీపీ గూటికి చేరిపోయారు. కొద్దిగొప్ప మిగిలిన నేతలు కూడా గులాబీ బాట పట్టేందుకు సిద్ధం అయ్యారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంలో అధికార టీఆర్ఎస్ నాయకత్వం కూడా బిజీగా ఉంది.
గులాబీ పార్టీ బాట పట్టేందుకు సీనియర్లు రంగం సిద్ధం
ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా టీడీపీలో కొనసాగుతున్నారు. ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాల వల్ల కొందరు నేతలు క్రియాశీలకంగా వ్యవహరించలేక పోతున్నారు. టీటీడీపీ రాజకీయం అంతా కేవలం ఇద్దరు ముగ్గురు నేతల చుట్టూ తిరుగుతుండటం, పార్టీ అధినేత చంద్రబాబు ఇక్కడి వ్యవహారాలను అంతగా పట్టించుకోకపోవడం, రానున్న ఎన్నికల్లో నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేమన్న అభిప్రాయం బలపడటంతో పలువురు సీనియర్లు బయటకు వచ్చే ప్రయత్నాలు షురూ చేశారని చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్లో ఉన్న మాజీ టీడీపీ నేతల సాయంతో తమ చేరికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అధికార పార్టీ టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
పరిగణనలోకి ఇతర పార్టీల నేతల సీనియార్టీ
వాస్తవానికి రెండు, మూడు నెలలుగా టీఆర్ఎస్ గూటికి చేరే టీడీపీ నేతల సంఖ్య పెరిగింది. నియోజకవర్గ స్థాయి నేతలు టీఆర్ఎస్లోకి వరుసకట్టారు. అదే కోవలో మరికొందరి చేరికలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కొన్ని సామాజిక వర్గాల ఓట్ల కోసం ఆయా వర్గాల నేతలపై కన్నేసిన టీఆర్ఎస్ నాయకత్వం సంబంధిత నేతల రికార్డు, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటోందని చెబుతున్నారు. దీనిలో భాగంగానే మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి చేరిక జరిగిందని ఉదాహరిస్తున్నారు.
1983 నుంచి టీడీపీలో కీలక పాత్ర పోషించిన మండవ
టీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి ద్వారా అందుతున్న సమాచారం మేరకు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం. ఆయనను టీఆర్ఎస్కు తీసుకువచ్చే బాధ్యతను ఒక మంత్రి తీసుకున్నారని, చేరిక ముహూర్తమే ఖరారు కావాల్సి ఉందంటున్నారు. మండవ చేరికతో పాత నిజామాబాద్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి లాభిస్తుందని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం కేటాయించాలా? లేక ఇతరత్రా అవకాశం కల్పించాలా? అన్న విషయంపైనే చర్చ జరుగుతోందని సమాచారం. మండవ గతంలో డిచ్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. టీడీపీ ఆవిర్భావం నుంచి నిజామాబాద్ జిల్లాల్లో క్రియాశీలంగా వ్యవహరించిన మండవ వెంకటేశ్వరరావు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు.
2004 వరకు మంత్రిగా.. గంగారెడ్డితో ఇలా విభేదాలు
1994లో ఎన్టీఆర్ క్యాబినెట్లో తర్వాత 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు క్యాబినెట్లో పని చేసిన మండవ వెంకటేశ్వరరావు నిజామాబాద్ జిల్లా వాసులందరికి కొట్టిన పిండి. కారణాలేమైనా 1999 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన గంగారెడ్డికి మండవ వెంకటేశ్వరరావుతో విభేదాలు వచ్చాయి. ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగే పరిస్థితుల్లేవు. దీంతో 2004 ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీలో చేరిన గంగారెడ్డి 2004 ఎన్నికల్లో డిచ్ పల్లి స్థానం నుంచి పోటీ చేసి మండవ వెంకటేశ్వరరావును మట్టి కరిపించి రికార్డు నెలకొల్పారు. నాటి నుంచి 2008, 2009, 2010 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన మండవ వెంకటేశ్వరరావు చాలా కాలంగా టీడీపీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు సుముఖంగా లేరన్న ప్రచారం కూడా ఉంది.
1995 నుంచి కొద్దికాలం మంత్రిగా సేవలు ఇలా
నిజామాబాద్ జిల్లాలోనే ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల విషయంలో కూడా కొంత చర్చ జరుగుతోంది. గతంలో ఆర్మూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏలేటి అన్నపూర్ణమ్మ కూడా టీడీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారని, టీఆర్ఎస్ నాయకత్వంతో చర్చలు కూడా జరిపారని సమాచారం. ఆమె బాల్కొండ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కావాలని కోరారని, టీఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో చేరిక ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా 1994లో ప్రాతినిధ్యం వహించారు. 1995లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొద్దికాలం మంత్రిగా కూడా పని చేశారు.
1999 ఎన్నికల్లో బాజిరెడ్డి చేతిలో ఓటమి
1994 తర్వాత ఏలేటి అన్నపూర్ణ ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలు లేవు. 1999 ఎన్నికల్లో ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. అన్నపూర్ణను ఓడించారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ శనిగరం సంతోష్ రెడ్డి చేతిలో అన్నపూర్ణ ఓటమి పాలయ్యారు. మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణలతోపాటు వరంగల్, దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా కొందరు టీడీపీ నేతలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సమాచారం.