చంద్రబాబుకు మరో బిగ్ షాక్: కాంగ్రెసులోకి నామా?
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణలో మరో పెద్ద షాక్ తగలబోతోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు సైకిల్ దిగే అవకాశం ఉంది.
నామా నాగేశ్వర రావు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా. ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఆది, సోమవారాల్లో అందుకు సంబంధించిన కసరత్త జరిగినట్లు చెబుతున్నారు.
పారిశ్రామికవేత్త మధ్యవర్తిత్వం..
నామా నాగేశ్వర్ రావు కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. నామాను తిరిగి ఖమ్మం లోకసభ సీటు నుంచి పోటీ చేయిస్తారని, అందుకు అవసరమైన ఒప్పందం కుదిరిందని అంటున్నారు
నామా విషయంలో అప్పట్లో ఇలా.
వ్యాపారవేత్తగా ఉన్న నామా నాగేశ్వరరావు గతంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఖమ్మం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ఆయన కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. లోకసభకు ఎన్నికైన నామాకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించింది.
అప్పట్లో తుమ్మలతో విభేదాలు...
ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుతో ఆయనకు విభేదాలు ఉండేవి. తుమ్మల నాగేశ్వర రావు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇరువురికీ పడేది కాదు. ఇప్పటికీ వారి మధ్య విభేదాలున్నాయి. దాంతో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు నామా నాగేశ్వర రావు దూరంగా ఉంటూ వచ్చారు. తుమ్మలతో సయోధ్య సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఎంచుకోలేదని అంటున్నారు.
చంద్రబాబుకు తెలిసే...
చంద్రబాబుకు తెలిసే నామా నాగేశ్వర రావు పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిడిపి ఉనికి ప్రశ్నార్థకం కావడంతో నామా నాగేశ్వర రావు ఆలోచనకు చంద్రబాబు మద్దతు పలికినట్లు చెబుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరర రావు తెరాస నుంచి కాంగ్రెసులో చేరారు.