మోడీ విమానానికి దారి చూపినందుకు ఛార్జ్ చేసిన పాక్ : ఎంతంటే?
న్యూఢిల్లీ: భారత ప్రధానప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణించిన విమానాలకు మార్గనిర్దేశనం చేసినందుకుగాను పాకిస్థాన్ రూ.2.86 లక్షల రుసుము వసూలు చేసింది. అందులో అత్యధిక మొత్తం.. 2015 డిసెంబరు 25లో లాహోర్లో ఆయన ఆకస్మిక పర్యటనకు సంబంధించిందే కావడం గమనార్హం.
వైమానికదళ విమానాల్లో ప్రధాని మోడీ పర్యటనలకు(2016 జూన్ వరకు) అయిన ఖర్చు వివరాలను నౌకాదళ విశ్రాంత అధికారి లోకేష్ బత్రా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద సేకరించారు. అందులోని వివరాల ప్రకారం.. 2016 జూన్ వరకు మోడీ 11 దేశాల పర్యటనలకు వాయుసేన విమానాన్ని ఉపయోగించారు.
రష్యా, అఫ్గానిస్థాన్ పర్యటనల నుంచి తిరిగి వస్తూ ఆయన లాహోర్లో ఆగినప్పుడు పాకిస్థాన్ అధికారవర్గాలు విమానయాన మార్గనిర్దేశన(మార్గం చూపినందుకు) రుసుం కింద రూ.1.49 లక్షలు వసూలు చేశాయి. తమ దేశం మీదుగా మోడీ వాయుసేన విమానంలో ఇరాన్ పర్యటనకు వెళ్లినప్పుడు రూ.77,215; ఖతార్కు వెళ్లినప్పుడు రూ.59,215 కూడా పాక్ వర్గాలు వసూలు చేశాయి.