నెల రోజులు గాయబ్: విచారణలో దిమ్మ తిరిగే రిప్లై
హైదరాబాదు: అక్రమాస్తుల కేసులో పట్టుబడిన హిఎండిఎ డైరెక్టర్ కె. పురుషోత్తమ రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు విచారణలో చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అతని నుంచి సమాచారం రాబట్టడం వారికి గగనంగా మారిందనే వార్తలు వస్తున్నాయి.
ఎసిబి అక్రమాస్తుల కేసు నమోదు చేసిన తర్వాత నెల రోజుల పాటు అతను తప్పించుకుని తిరిగాడు. ఆ నెల రోజుల పాటు ఎక్కడికెళ్లావని అడిగితే అతని సమాధానం విని ఎసిబి అధికారులు నివ్వెరపోయారట
చికిత్స కోసం కేరళ వెళ్లానని...
తన భార్యకు చికిత్స చేయించడానికి కేరళకు ఆమెతో పాటు లారీలో వెళ్లానని పురుషోత్తమ రెడ్డి చెప్పాడని సమాచారం. విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎసిబి అధికారులు అతన్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు అతన్ని విచారించారు.
ఏ ప్రశ్నకూ సూటిగా సమాధానం లేదు...
తొలి రోజు విచారణలో శుక్రవారం ఎసిబి అధికారులు వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వలేదని, డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడని అంటున్ారు.
జనవరి 10వ తేదీన కేసు
పురుషోత్తమరెడ్డిపై ఎసిబి అధికారులు జనవరి 10వ తేదీన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఒకేసారి సోదాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ స్థితిలో జనవరి 11వ తేదీ నుంచి సెలవు పెట్టి వెళ్లిపోయాడు. ఆయన కుటుంబం జాడ కూడా కనిపించలేదు. అతను లేకుండానే ఫిబ్రవరి 2వ తేదీన కొన్ని చోట్ల సోదాలు నిర్వహించారు.దాదాపు 25 కోట్ల రూపాయల అక్రమాస్తులను కనిపెట్టారు.
గాలిస్తుండగా లొంగిపోయాడు...
అతని కోసం ఎసిబి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అతను ఫిబ్రవరి 16వ తేదీన కోర్టులో లొంగిపోయాడు. ఆ తర్వాత ఎసిబి అధికారులు పిటిషన్ వేసి విచారణ నిమిత్తం అతన్ని ఆరు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జనవరి 11 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఎక్కడికెళ్లావని ఎసిబి అధికారులు అడిగితే తన భార్యకు చికిత్స చేయించడానికి కేరళ వెళ్లినట్లు తెలిపాడని సమాచారం.