సోనియా విందుకు కేసీఆర్, బాబు దూరం: ఏమీ లేకుండానే...
న్యూఢిల్లీ: యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ భాగస్వామ్య పక్షాల నేతలకు ఇచ్చే విందుకు టిఆర్ఎస్, టిడిపి హాజరవుతాయా, కావా అనే చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని సోనియా గాంధీ తాను ఇచ్చే ఆతిథ్యానికి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కూడా ఆహ్వానించాలని సోనియా గాంధీ భావించినట్లు ప్రచారం సాగింది. బిజెపితో సంబంధాలు దెబ్బ తిన్న నేపథ్యంలో టిడిపిని సోనియా గాంధీ విందు సమావేశానికి ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
వారికి ఆహ్వానాలు అందాయా...
కేసీఆర్, చంద్రబాబులకు సోనియా గాంధీ నుంచి ఆహ్వానాలే అందలేదని సమాచారం. శనివారం వరకు కూడా వారికి ఆహ్వానాలు రాలేదని సమాచారం. ఢిల్లీలో ఈ నెల 13వ తేదీన యుపిఎ భాగస్వామ్య పక్షాలకు సోనియా గాంధీ విందు ఇవ్వాలని నిర్ణయించారు.
ఆహ్వానం రాకపోవచ్చునని...
సోనియా గాంధీ నుంచి టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానం అందే అవకాశాలు కూడా లేవని ఆ పార్టీల నాయకులే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెసు వ్యతిరేకతతో జరిగింది. కేసీఆర్ కూడా కాంగ్రెసుకు వ్యతిరేకంగానే న్నారు. ఒకవేళ ఆహ్వానాలు అందినా ఆ రెండు పార్టీలు సోనియా విందుకు హాజరు కాకపోవచ్చునని అంటన్నారు.
కేసీఆర్ ఇలా బిజీ...
కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఏర్పాటులో ఆయన బిజీగా కూడా ఉన్నారు. అందువల్ల టిఆర్ఎస్కు సోనియా గాంధీ నుంచి ఆహ్వానం అందుతుందా అనేది అనుమానమే. ఒక వేళ వచ్చినా టీఆర్ఎస్ వెళ్లకపోవచ్చునని అంటున్నారు.
చంద్రబాబు వైఖరి ఇదీ...
తెలుగుదేశం పార్టీకి కూడా సోనియా గాంధీ నుంచి ఆహ్వానం రాలేదని సమాచారం. కేంద్ర మంత్రులను మోడీ ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ చంద్రబాబు ఇంకా ఎన్డీఎలో కొనసాగుతున్నారు. ఆయన వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ స్థతిలో సోనియా గాంధీ నుంచి ఆహ్వనం అందినా కూడా టిడిపి హాజరయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.