ఒంటరి పోరు పాట: జగన్తో బిజెపి సీక్రెట్ అవగాహన?
అమరావతి: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఎ నుంచి వైదొలిగిన తెలుగుదేశం పార్టీ కూడా అదే విషయాన్ని ప్రచారం చేస్తోంది.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని రెండు పార్టీలు కూడా చెబుతున్నాయి. కానీ, ఆ విషయాన్ని ఎవరు కూడా నమ్మడం లేదు. రెండు పార్టీల మధ్య అవగాహన ఉంటుందనే చర్చ సాగుతోంది.
Recommended Video
రామ్ మాధవ్ ఇలా చెప్పారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ఎన్డీఎ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగిన వెంటనే రాష్ట్ర నేతలతో అమిత్ షా ఢిల్లీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రామ్ మాధవ్ను ఈ సమావేశంలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా నియమించారు. ఆ వెంటనే రామ్ మాధవ్ ప్రత్యేకంగా సమావేశమై పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు. తాము రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఈ సందర్భంగా రామ్ మాధవ్ చెప్పారు.
శ్రీకాంత్ రెడ్డి ఇలా చెప్పారు..
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జి. శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.. బిజెపితో తాము జత కట్టినట్లు టీడిపి దుష్ప్రచారం చేస్తోందని ఆయన సోమవారం మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఒంటరిగా విజయం సాధించలేని టిడిపి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని అన్నారు.
ఎందుకలా చేస్తున్నారు....
ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి వైఎస్ జగన్ సిద్ధంగా లేరని అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన ప్రధాని మోడీతో భేటీలో చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో కలిసి నడుస్తామని ఆయన అన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకుంటే మైనారిటీల ఓట్లు తమకు పడవనే ఉద్దేశంతో ఆయన దూరంగా ఉండాలని అనుకుంంటున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల తర్వాత అవసరమైతే...
ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి వైఎస్ జగన్ బిజెపి మద్దతు తీసుకోవడమో, బిజెపికి మద్దతు ఇవ్వడమో చేస్తారని అంటున్నారు. ఈ రకమైన అవగాహన మాత్రం రెండు పార్టీల మధ్య ఇప్పటికే కుదిరిందనే ప్రచారం సాగుతోంది. మొత్తం మీద వైఎస్ జగన్ను బిజెపి చేరదీసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు.