వైఎస్ సలహాదారులతో జగన్కు అగాథమే: అసలేమవుతోంది?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సలహాదారులకు మధ్య తీవ్రమైన అగాథం పెరిగింది. వారిని జగన్ స్వయంగా దూరం పెట్టినట్లు తెలుస్తోంది.
నాయకులకు, కార్యకర్తలకు మధ్య పెరుగుతున్న దూరం విషయంపై కొంత మంది జగన్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. వైయస్ రాజశేఖర రెడ్డికి గతంలో అత్యంత సన్నిహితంగా మెలిగినవారు ఒక్కరొక్కరే జగన్కు దూరమవుతున్నారు.
వీరు ఇలా దూరం...
వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో కీలక వ్యక్తిగా ఉన్న సోమయాజులు ఇప్పుడు జగన్ చెంతకు రావడం లేదు. అలాగే, కొణతాల రామకృష్ణ కూడా దూరమయ్యారు. మరో నేత సబ్బం హరి జగన్కు అండదండగా ఉంటూ వచ్చి క్రమంగా దూరమయ్యారు. జగన్ నాయకత్వ తీరుపై విసిగిపోయి వారు దూరమైనట్లు భావిస్తున్నారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలా...
వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ చెంతకు కూడా రావడం లేదు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెసు పార్టీకి దూరమయ్యారు. అయితే, కాంగ్రెసు పార్టీ ఇటీవల పోలవరం ప్రాజెక్టుకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. తిరిగి ఆయన కాంగ్రెసులోకి వస్తారా అనేది వేచి చూడాల్సిందే.
వైఎస్ ఆత్మ కెవిపి రామచంద్రరావు...
వైఎస్ శరీరం అయితే, కెవిపి రామచంద్రరావు ఆత్మలాగా ఉండేవారు. కెవిపి రామచంద్రరావు వైఎస్ జగన్ పెట్టిన పార్టీలోకి రాలేదు. దూరంగానే ఉంటూ వస్తున్నారు. కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతున్నారు. జగన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని వ్యతిరేకిస్తూ సొంత పార్టీ పెట్టడం ఆయనకు ఇష్టం లేదని అంటారు. జగన్ పట్ల ఆయనకు వ్యక్తిగత అభిమానం మాత్రం తగ్గలేదని అంటారు.
సమీక్షకు జగన్ సమాయత్తం
ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పాదయాత్ర వేయి కిలోమీటర్ల మైలు రాయి దాటిన తర్వాత పార్టీ పనితీరును ఆయన సమీక్షిస్తారని అంటున్నారు. పార్టీలో విభేదాల విషయం జగన్కు తెలుసునని, వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు.
ఐదు కొలమానాలతో సమీక్ష...
పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు జగన్ వ్యూహం ప్రకారం వెళ్తున్నట్లు చెబుతున్నారు. దానికి ఐదు కొలమానాలు పెట్టుకున్నట్లు సమాచారం. నెలవారీగా సమీక్ష నిర్వహించాలని ఆయన అనుకుంటున్నారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై నియోజకవర్గాల ఇంచార్జీలు కూడా తెలుసుకుని తగిన రీతిలో స్పందించాలనే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలకు దగ్గర కావడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పెంచాలని అనుకుటున్నారు.