ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణిని విమానంలో నుంచి చూశారు
వాషింగ్టన్: శాన్ఫ్రాన్సిస్కో నుంచి హాంకాంగ్ వెళ్తున్న విమాన ప్రయాణికులకు ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి కనిపించిందని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ వెల్లడించారు. ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్ నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత నవంబరులో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరాల ప్రకారం.. విమానం క్షిపణి ప్రయోగ ప్రాంతానికి 280 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. ఆ సమయంలో అంతే ఎత్తులో మరో 9 విమానాలు ప్రయాణిస్తున్నాయి.
హాంకాంగ్ వెళ్తున్న విమానంలోని సిబ్బంది తాము క్షిపణి రీ ఎంట్రీ చూసినట్లు చెప్పారని టిల్లర్సన్ తెలిపారు. ఆ ప్రయోగం కారణంగా విమానం దారి మళ్లించుకుందన్నారు. అయితే ఆ విమానం ఏ ఎయిర్ లైన్స్కు చెందిందో చెప్పలేదు.
ఉత్తర కొరియా ఈ విధంగా ఏ సమయంలోనైనా క్షిపణి ప్రయోగాలు చేపట్టడం అన్ని దేశాల పౌరులకు ఎంతో ప్రమాదకరమని, ప్రతి రోజు అక్కడి ఎయిర్ స్పేస్ నుంచి ఎన్నో విమానాలు ప్రయాణిస్తుంటాయన్నారు.
లాస్ఏంజెల్స్, శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన కొరియన్ ఎయిర్కు చెందిన విమానాల సిబ్బంది కూడా తాము గాల్లో వెలుగు చూసినట్లు చెప్పారు. ఉత్తర కొరియాకు నిధుల విషయంలో కట్టడి చేయాలని మిత్ర దేశాలను కోరిన సందర్భంలో టిల్లర్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు.