బ్రిక్స్ సదస్సు : రష్యాతో భారత్ కీలక ఒప్పందాలు
గోవా : గోవా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో పుతిన్, మోడీ మధ్య కీలక సమావేశం జరిగింది. వీరిద్దరి భేటిలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా పుతిన్ సహకారంతో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించిన మోడీ.. రక్షణ, నిర్మాణం, ఆర్థిక, వ్యాపారం రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినట్లుగా తెలిపారు.
స్నేహపూర్వక వాతావరణంలో ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ఈ సందర్బంగా మోడీ పేర్కొన్నారు. న్యూక్లియర్ అంశాలకు సంబంధించి పలు విషయాల్లో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరినట్లుగా చెప్పారు. ఎస్400 మిసైల్ వ్యవస్థ కోసం రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా తెలియజేశారు.
ఇకపోతే తాజా ఒప్పందాల్లో భాగంగా మహారాష్ట్రలోని నాగ్పూర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరాల మధ్య హైస్పీడ్ రైలు నడిపేందుకు భారత్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరడం విశేషం. రష్యా అధినేత పుతిన్, భారత ప్రధాని మోడీ సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలను ఇరువురు ఇచ్చి పుచ్చుకున్నారు.
రష్యా అధ్యక్షుడితో సమావేశం అనంతరం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమాతో వరుసగా భేటీ అవనున్నారు మోడీ. ఎన్ఎస్జీ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, పాక్-చైనా ఆర్థిక కారిడార్ వంటి అంశాలపై చైనా అధ్యక్షుడితో మోడీ చర్చించే అవకాశం ఉంది.