86 రోజుల తర్వాత కేదార్నాథ్ గుడిలో పూజలు
ప్రస్తుతం కేదార్నాథ్లో వాతావరణం ప్రశాంతంగా ఉండడంతో పూజలు ప్రారంభించేందుకు ఆలయ కమిటీ అధికారులు సిద్ధమయ్యారు. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయ తలుపులను 86రోజుల తర్వాత తీశారు. పురోహితుడు రావల్ భీమా శంకర్ లింగ్ శివాచార్య పూజా కార్యక్రమాలను పున:ప్రారంభించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.
కాగా కేదార్నాథ్ ఆలయంలో పూజా కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, కొందరు మంత్రులతో హాజరవుతున్నట్లు సమాచారం. పూజా కార్యక్రమాలను చిత్రీకరించేందుకు బయల్దేరిన కొందరు మీడియా ప్రతినిధులు వాతావరణం అనుకూలించకపోవడంతో గుప్తకాశీలోనే ఆగిపోయారు.
శుద్ధికరణ్, ప్రయాచిత్తీకరణ్లతో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రధాన పురోహితుడితోపాటు కొందరు తీర్థ్ పురోహితులు, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ అధికారులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం ఆలయ దర్శనకు భక్తులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఉత్తరాఖండ్లో జూన్లో సంభవించిన భారీ వరదల కారణంగా చాలా మంది భక్తులు మృతిచెందారు. రుద్రప్రయాగ, ఉత్తరకాశీ, చమోలి, పిత్తోర్గఢ్ జిల్లాల్లో సుమారు 600మంది చనిపోగా 4వేల మంది భక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.