బిజెపిలోకి రాజ్యవర్ధన్, దివ్య: కాంగ్రెస్కు బిధురి ఝలక్
ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ.. దేశం క్లిష్టంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో తాను స్పందించకుండా ఉండలేనని చెప్పారు. మోడీ దేశాన్ని నడిపించే నిర్ణయాత్మక నాయకుడన్నారు. ప్రస్తుతం రాజకీయాలను, నాయకులను ద్వేషిస్తున్నారని తనకు తెలుసునని కానీ, నిస్వార్థంగా పనిచేసే వారి పట్ల ఇప్పటికీ తనకు నమ్మకముందన్నారు. తాను దేశానికి 23 ఏళ్లు సేవ చేశానని చెప్పారు. రాథోడ్తో పాటు జైపూర్ రాజకుటుంబానికి చెందిన దివ్య సింగ్ కూడా బిజెపిలో చేరారు.
కాంగ్రెస్కు బిధురి షాక్
గుజ్జర్ నేత, ఢిల్లీ ఎన్సిపి మాజీ అధ్యక్షుడు రాంవీర్ సింగ్ బిధురి కాంగ్రెసు పార్టీకి షాకిచ్చారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆయన ముగ్గురు ఎన్సీపి కౌన్సెలర్లతో పాటు బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ ఎన్నికల వ్యవహారాల ఇంఛార్జ్ నితిన్ గడ్కరీల సమక్షంలో ఆయన బిజెపిలో చేరారు.
ఈ నెల 6వ తేదిన బిధురి కాంగ్రెసు పార్టీలో చేరాల్సి ఉంది. అందుకోసం ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కానీ, దానికి బిధురి హాజరు కాలేదు. ట్రాఫిక్ స్తంభించడంతో దానికి రాలేకపోయినట్లు ఆ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చెప్పారు. కానీ, అంతలోనే బిధురి బిజెపిలో చేరారు.