ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఎల్లుండి దోషులకు శిక్ష ఖరారు
దోషులపై ఏ విధమైన జాలి చూపవద్దని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దోషులకు గరిష్ట స్థాయి శిక్ష వేయాలని, వారికి మరణశిక్ష విధించడమే సరైందని అన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేపై డిఫెన్స్ తరఫు న్యాయవాది ఇచ్చిన కోర్టు ధిక్కరణ నోటీసును కోర్టు తిరస్కరించింది.
వైద్య విద్యార్థిని నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు దోషులకు శిక్షను ఖరారు చేయడానికి బుధవారం ఉదయం సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే.
దోషులను కోర్టుకు బుధవారం ఉదయంతీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా దోషులుగా తేలినవారిలో ఒకతను తాను నిర్దోషినని గట్టిగా అరిచాడు. రెండు సార్లు అతను గట్టిగా అరిచి ఆ మాట అన్నాడు. దోషులకు మరణశిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు, తమకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని నిర్భయ తండ్రి అన్నారు.
వైద్య విద్యార్థినిపై నిరుడు డిసెంబర్ 16వ తేదీన అత్యంత కిరాతకంగా బస్సులో అత్యాచారం జరిగింది. ఆమె సింగపూర్ ఆస్పత్రిలో ఆ తర్వాత మరణించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. ఆరుగురిలో ప్రథమ ముద్దాయి రాంసింగ్ మరణించాడు. మరో వ్యక్తి మైనర్ కావడంతో అతనిపై బాలనేరస్థుల కోర్టు విచారణ జరిపింది.