ఢిల్లీ గ్యాంగ్ రేప్: దోషులని తేలిన ఆ నలుగురు ఎవరు?
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం ఘటనను తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ రాక్షసత్వం ఇంకా ఉందా అనే అనుమానం, భయం ముప్పిరిగొంటాయి. వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషులుగా తేల్చింది. రేపు బుధవారం వారికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
అంత రాక్షసత్వంగా వ్యవహరించిన ఆరుగురిలో దోషులుగా తేలిన ఆ నలుగురు ఎవరనే ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. వారి జీవితం ఎలా సాగేది, వారి కుటుంబాల నేపథ్యం ఏమిటి, వారికి కుటుంబాలున్నాయా అనే అనుమానాలు రాక తప్పదు. వారు అంత ఘాతుకంగా ఎలా వ్యవహరించగలిగారనేది ఆశ్చర్యకమైన విషయమే.
ఆ నలుగురు దోషుల్లో ముగ్గురు కూడా దినసరి వేతన కూలీలే కావడం గమనార్హం. వినయ్ కుమార్ అనే వ్యక్తి మాత్రం జిమ్లో పనిచేసేవాడు. వారిలో కొందరికి కుటుంబాలున్నాయి. భార్యలూ పిల్లలూ ఉన్నారు. అయితే, వారు ఆ రాత్రి వినోదం కోసమే అంత క్రూరంగా వ్యవహరించారా అనే అనుమానాలు కలగకమానవు. అంత క్రూరంగా 23 ఏళ్ల అమ్మాయి పట్ల ఎలా వ్యవహరించగలిగారనేది మానవుడనే వాడికి అంతు పట్టని విషయం.
వినయ్ శర్మ: నేరం చేసినప్పుడు అతని వయస్సు 29 ఏళ్లు. నలుగురిలోనూ ఎక్కువ చదువుకున్నవాడు ఇతనే. పదో తరగతి పాసైన ఇతను స్థానిక జిమ్లో అసిస్టెంట్గా పనిచేసేవాడు. తనపై వచ్చిన ఆరోపణలను అతను ఖండిస్తున్నాడు. నేరం జరిగినప్పుడు తాను బస్సులో లేనని చెబుతున్నాడు. ఇతర దోషులు ఉండే ప్రాంతంలో ఉంటాడు. భారత వైమానిక దళంలో ఉద్యోగిగా చేరాలని అతను కోరుకుంటున్నాడు. సహ ఖైదీలు అతనిపై తీహార్ జైలులో అతనిపై దాడి చేశారు. మరో జైలుకు పంపించాలని అతను న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసుకున్నాడు. కస్టడీలో ఉండగా అతని ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది.
ముఖేష్ సింగ్: రేప్ కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్ సోదరుడు. రాజస్థాన్ నుంచి వచ్ిచ తన సోదరుడు పనిచేస్తున్న బస్సు మీదనే పనిచేసేవాడు. ఢిల్లీలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. తాను నేరం చేయలేదని, ఆ రోజు తాను బస్సులో లేనని, మహిళలంటే తనకు అత్యంత గౌరవమని అతను చెప్పుకున్నాడు. తాను సాధారణ జీవితం గడుపుతానని, కష్టపడి పనిచేస్తానని చెప్పుకున్నాడు.
అక్షయ్ ఠాకూర్: ఇతనికి పెళ్లయింది. రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. బీహార్లో అత్తగారింట్లో దాక్కున్న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేస్తారనే భయంతో ఢిల్లీ నుంచి డిసెంబర్ 17వ తేదీన బీహార్కు పారిపోయాడు. దోషిగా తేలితే అతన్ని కాల్చి చంపాలని అతని భార్య పునీతా దేవి వ్యాఖ్యానించింది.
పవన్ గుప్తా: నేరం జరిగినప్పుడు అతని వయస్సు 19 ఏళ్లు. మైనర్ నిందితుడిని వదిలేస్తే అందరిలో ఇతనే చిన్నవాడు. అతను బస్సు డ్రైవర్ రాంసింగ్ మిత్రుడని చెబుతారు. తన కజిన్తో కలిసి రామ్ దాస్ శిబిరంలో ఉండేవాడు. అతను పళ్లు అమ్ముకునేవాడు. రోడ్లు, భవనాల నిర్మాణంలో కూలీగా పనిచేసేవాడు. పెళ్లిల్లో క్యాటరింగ్ కంపెనీలో పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా చేశాడు.