ఆశారాం బాపు కేసులో ట్విస్ట్: ఎవరో తెలియదన్న శిల్పి
జోధ్పూర్: ఆశారాం బాపు కేసులో ట్విస్ట్. ఆశారాం బాపు లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చి, కేసు నమోదయినప్పటి నుండి పరారీలో ఉన్న చింద్వారా గురుకుల్ ఆశ్రమ్ హాస్టల్ వార్డెన్ శిల్పి బుధవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. తనకు ఆశారాం తెలియదని ఆమె పోలీసులకు చెప్పడం గమనార్హం. శిల్పి ఆంటిసిపెటరీ బెయిల్ కోసం జోధ్పూర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
శిల్పికి ఆశారాంతో లైంగిక సంబంధాలు ఉన్నట్లుగా ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే, ఆమె మాత్రం తనకు ఆశారాం తెలియదని చెబుతున్నారు. ఆశారాంతో సంబంధం కలిగి ఉన్న శిల్పి... ఆయనకు అమ్మాయిలను, మహిళలను కూడా సరఫరా చేసే వారని ఆరోపణలు ఉన్నాయి.
16 ఏళ్ల బాలిక పైన లైంగిక వేధింపులు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆశారాం అరెస్టయ్యారు. అప్పటి నుండి శిల్పి పరారీలో ఉన్నారు. శిల్పి, మరో నిందితులు బాలికలను మభ్యపెట్టి ఆశారాం వద్దకు తీసుకు వెళ్లేవారు. ఆశారాం వారిని గదిలోకి తీసుకు వెళ్లి లైంగిక వేధింపులకు గురి చేసేవారట.
శిల్పికి ఆశారాంతో ఏళ్లుగా లైంగిక సంబంధముందని ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఆమెకు ఆశారం ఢిల్లీలో, అహ్మదాబాదులో రెండు ఫ్లాట్స్ కూడా బహుమతిగా ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా, తమ విచారణలో అలాంటి అంశాలు ఏవీ వెల్లడి కాలేదని జోధ్పూర్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, జోధ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న ఆశారాం బాపుకు నార్కో పరీక్షలు జరపాలని బాధిత బాలిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు.