సభ్య సమాజం సిగ్గుపడేలా తెరాస, మతలబు ఏమిటి: జానారెడ్డి
హైదరాబాద్: సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వ్యవహరిస్తోందని కాంగ్రెసు శాసనసభా పక్ష నేత కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. సంఖ్యాబలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పోటీ చేయడం వెనక మతలబు ఏమిటని ఆయన అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెసు నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, దామోదర్రెడ్డి బుధవారం మండలి సభలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెరాస ప్రలబోపెట్టినా కాంగ్రెస్ను గెలిపించిన స్థానిక సంస్థల ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెరాస నేతల మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అధికార పార్టీ కుట్ర చేస్తోందని అన్నారు.
ప్రతిపక్షాల సలహాలు, సూచనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జానారెడ్డి ధ్వజమెత్తారు. తమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, దామోదర్రెడ్డిలు అన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లేశారని, ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతామని వారు తెలిపారు.
బూటకంగా మార్చారు...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను బూటకపు ఎన్నికలుగా మార్చారని కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అధికారి భన్వర్లాల్ టీఆర్ఎస్ ఏజెంట్గా మారారని విమర్శించారు.
భూపాలపల్లి ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన ప్రకటనల్లో మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్ ఫొటో ఎక్కడా లేదని ఆయన సీఎం కేసీఆర్ను నిలదీశారు. దళితులు, గిరిజనులను అవమానించారని ప్రభాకర్ మండిపడ్డారు.
తెరాస చేసిందేమిటి...
గ్రేటర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లిగవ్వ కూడ ఖర్చుపెట్టలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి అన్నారు. కార్పొరేషన్ బడ్జెట్ను మాత్రమే ఖర్చు చేశారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మంగళవారం ప్రారంభించిన కేటీపీపీ విద్యుత్ప్లాంట్ ఆలోచన, ఆచరణ గత ప్రభుత్వాలదేనన్నారు. ప్రారంభోత్సవం చేసే అవకాశం మాత్రమే కేసీఆర్కు వచ్చిందని ఆయన అన్నారు. డివిజన్ల రిజర్వేషన్ ప్రక్రియ కేసీఆర్ కుటుంబ వ్యవహారం కాదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశాయని చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు.
ఓటమి భయంతోనే...
ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసేందేమీ లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసిన ప్రజల నమ్మరని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీగెలపును ఎవరు అడ్డుకోలేరని ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.
రాచరిక పాలన
రాష్ట్రంలో రాచరిక పాలన అమలవుతోందని బిజెపి అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని ఆయన బుధవారం మెదక్ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు టీఆర్ఎస్ చీకటి ఒప్పదం చేసుకుందని విమర్శించారు.
ఉగ్రవాదాన్ని నిరోదించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కూటమిదే గెలుస్తుందని కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.