ఈ కామర్స్ భారీ రిక్రూట్మెంట్: దీపావళి నాటికి 5 లక్షల కొత్త ఉద్యోగాలు
ముంబై: పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు ఆఫర్లతో ఆకట్టుకుంటాయి. దీంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ కామర్స్ సంస్థలు కూడా డిమాండ్ తగినట్లుగా ఉద్యోగులను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి.
ఈ రంగంలో ఇప్పటివరకు దాదాపు 300,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. దీపావళి వరకు 500,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు జోడించబడతాయని టీమ్లీజ్ నివేదిక వెల్లడించింది. అయితే, గిగ్ వర్కర్ల డిమాండ్ టైర్-1 నగరాలకు మాత్రమే పరిమితం కాదు. టీమ్లీజ్ నివేదిక ప్రకారం.. టైర్-2, టైర్-3 నగరాలు 40 శాతం పెరిగాయి. దీంతో డెలివరీ కార్మికులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.
'ఈ-కామర్స్ కంపెనీలు తమ డెలివరీ సమయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నందున లాజిస్టిక్స్ డొమైన్లో నియామకాలు కూడా పెరిగాయి. నిజానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సెగ్మెంట్ డిసెంబర్ 2022 నాటికి 8,00,000 ఉద్యోగాలను అదనంగా పెంచుకుంటుందని అంచనా వేస్తున్నారు' అని టీమ్లీజ్లో వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ (రిటైల్, ఇ-కామర్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్) అజోయ్ థామస్ అన్నారు.
"క్విక్-కామర్స్, క్యూఎస్ఆర్లు, రిటైల్ స్టోర్లు, ఎఫ్ఎమ్సిజి, ఎఫ్ఓఎస్ (ఫుట్స్ ఆన్ ది స్ట్రీట్) సేల్స్మెన్లు డెలివరీ ఎగ్జిక్యూటివ్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న పోస్టులు' అని తెలిపారు. దేశంలో 300,000-400,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్లుగా పనిచేస్తున్నారు. ఇ-కామర్స్ కంపెనీలు తమ డెలివరీ ఫ్లీట్ల నిర్వహణ ఖర్చులను పరిష్కరించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే దీపావళి పండగ ఉన్న నేపథ్యంలో వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్ కు తగినట్లుగా సంస్థలు తమ సిబ్బందిని పెంచుకుంటున్నాయని నివేదిక వెల్లడించింది.