కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖల్లో మొత్తం 9.79 లక్షల పోస్టుల ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వివిధ శాఖల్లో 9,79,327 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం లోక్సభకు తెలిపారు. గ్రూప్-ఏలో 23,584 పోస్టులు, గ్రూప్-బీ 1,18,807, గ్రూప్-సీ 8,36,936 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
"వ్యయ శాఖ వార్షిక నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/ శాఖల క్రింద 01.03.2021 నాటికి గ్రూప్ ఏ, బీ, సీ లలో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య వరుసగా 23,584, 1,18,807, 836936' అని మంత్రిత్వ శాఖ తెలిపింది. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సీఎస్ఎస్) సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్లో మొత్తం అధికారుల కొరత ఉందని ఆయన అన్నారు.
రాజ్యసభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. జూలై 2022 నాటికి, 8000 మందికి పైగా సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సీఎస్ఎస్), సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (సీఎస్ఎస్ఎస్), సెంట్రల్ సెక్రటేరియట్ క్లరికల్ సర్వీస్ (సీఎస్సీఎస్) అధికారులు పదోన్నతి పొందారని, 2013 నుంచి పెండింగ్లు పెద్ద ఎత్తున పదోన్నతులకు మార్గం సుగమం చేశామన్నారు.
అంతిమ నిర్ణయానికి లోబడి కేవలం అధీనంలో ఉన్న ఖాళీలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మిషన్ రిక్రూట్మెంట్, రోజ్గార్ మేళాలో భాగంగా ఇప్పటివరకు 1.47 లక్షల మందికి పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / పిఎస్యులు / స్వయంప్రతిపత్త సంస్థలు / బ్యాంకులు మొదలైన వివిధ పోస్టులలో కొత్తగా నియమితులైనట్లు మంత్రి చెప్పారు.
రోజ్గార్ మేళాపై మరొక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంగా.. జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలియజేశారు. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న రోజ్గార్ మేళాలు మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని, యువతకు వారి సాధికారత, భాగస్వామ్యం కోసం అర్ధవంతమైన అవకాశాలను అందిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
గత ఐదేళ్లలో గ్రూప్ 'ఎ', 'బి', 'సి' సర్వీసుల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) వరుసగా 1,74,894, 24,256 మంది అభ్యర్థులను సిఫార్సు చేశాయని కేంద్రమంత్రి చెప్పారు.