నైపుణ్యాలు పెంచుకుంటేనే ఉద్యోగాలు- అరకొర స్కిల్స్తోనే 92 శాతం ఉద్యోగులు- తాజా సర్వే
కరోనాకు ముందు భారత్లో ఉద్యోగాల గురించిన చర్చ వచ్చినప్పుడు ఆర్ధిక అంశాల గురించే ఎప్పుడూ చర్చించుకునే వారు. పలు దేశీయ, అంతర్జాతీయ సంస్ధలు తమ నివేదికల్లో సైతం ఉద్యోగులు, ఉద్యోగాలపై ఆర్ధిక మాద్యం ప్రభావం గురించే ప్రస్తావించేవి. కానీ ఇప్పుడు కరోనా తర్వాత పలు సంస్ధల ఆర్ధిక పరిస్ధితి తలకిందులు కావడంతో ఉద్యోగాలు చాలా సులువుగా ఆవిరైపోతున్నాయి.
ఉన్న ఉద్యోగుల్లో సైతం నైపుణ్యాల పరిస్ధితి ఎలా ఉందనే అంశాన్ని సంస్ధలు గణించే పనిలో పడ్డాయి. దీంతో ఇప్పుడు కొత్త కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు సంస్ధల్లో పనిచేస్తున్న ఫుల్ టైమ్ ఉద్యోగుల్లో నైపుణ్యాల స్ధాయిపై తాజాగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉడెమీ నిర్వహించిన సర్వే నివేదిక కూడా ఆసక్తికరంగా ఉంది.
ఉడెమీ సర్వే నివేదిక...
అంతర్జాతీయంగా ఉద్యోగాలు కోరుకుంటున్న యువతకూ, సంస్ధలు కోరుతున్న నైపుణ్యాలకూ మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తాజాగా ఆన్లైన్ కోర్సుల ప్లాట్ఫామ్ ఉడెమీ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. 2019-20 సంవత్సరానికి నిర్వహించిన ఈ సర్వేలో భారత్, బ్రెజిల్, మెక్సికో, స్పెయిన్ దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఉద్యోగుల నుంచి ఉడెమీ ప్రతినిధులు అభిప్రాయాలు సేకరించారు. ఇందులో ఉద్యోగార్ధుల అంచనాలకూ, సంస్ధల అంచనాలకూ మధ్య భారీ గ్యాప్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఉద్యోగార్ధులను, ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగులను కూడా నైపుణ్యాల కొరత వేధిస్తోందని తెలుస్తోంది.
భారత్లో పరిస్ధితి దారుణం..
దేశవ్యాప్తంగా పలు కార్పోరేట్ సంస్ధల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఉడెమీ సేకరించిన వివరాలను గమనిస్తే పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమవుతుంది. దేశంలోని వివిధ సంస్ధల్లో పనిచేస్తున్న ఫుల్ టైమ్ ఉద్యోగుల్లో 92 శాతం తమకు నైపుణ్యాల కొరత ఉందని అంగీకరించారని ఉడెమీ తెలిపింది. అలాగే వీరిలో 76 శాతం మంది నైపుణ్యాల కొరత తమపై ప్రభావం చూపుతోందని కూడా అంగీకరించినట్లు వెల్లడించింది. అంటే నైపుణ్యాల కొరత కారణంగా వీరి ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నట్లు వీరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వీటిని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు తెలిపారు.
ఈ నాలుగు నైపుణ్యాల్లో కొరత...
మన దేశంలో ఉడెమీ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో దాదాపుగా అందరూ నాలుగు అంశాల్లో నైపుణ్యాల కొరత ఉందని అంగీకరించారు. వీటిలో ప్రధానంగా సంస్దల యాజమాన్యాలు కోరుతున్నవే ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో మూడింట రెండో వంతు మంది ఈ నైపుణ్యాలు తమలో లేవనే భావిస్తున్నారు. ఈ నైపుణ్యాల్లో ప్రధానంగా సాంకేతిక, డిజిటల్ స్కిల్స్, నాయకత్వ, వ్యాపార నైపుణ్యాలు, ఉత్పత్తి నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి. ఇందులో సాంకేతిక, డిజిటల్ స్కిల్స్ కొరత ఉందని 68 శాతం, నాయకత్వ, వ్యాపార నైపుణ్యాల కొరత ఉందని 66 శాతం, ఉత్పత్తి నైపుణ్యాలు లేవని 66 శాతం, సాఫ్ట్ స్కిల్స్ లేవని 63 శాతం మంది చెప్పారు.
ఆన్లైన్ కోర్సులకు రెడీ...
తమలో ఉన్న నైపుణ్యాల కొరతను అధిగమించేందుకు, తద్వారా ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఆన్లైన్ ద్వారా స్కిల్ కోర్సులు నేర్చుకునేందుకు భారత్లో అత్యధిక శాతం మంది ఉద్యోగులు రెడీ అవుతున్నట్లు ఉడెపీ నివేదిక తెలిపింది. ఇలా ఆన్లైన్ కోర్సుల ద్వారా స్కిల్స్ పెంచుకునేందుకు 44 శాతం మంది, కార్పోరేట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ద్వారా మరో 34 శాతం మంది తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తేలింది. ఇలా నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా కొత్త ఉద్యోగాల్లోకి మారాలని ఏకంగా 97 శాతం మంది ఉద్యోగులు భావిస్తున్నట్లు ఉడెపీ నివేదిక వెల్లడించింది.
ఉద్యోగాలకు పనికిరాని చదువులు..
ప్రస్తుతం కాలేజీల్లో నేర్చుకుంటున్న చదువులు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏమాత్రం పనికిరావడం లేదని భారత్లో సర్వేలో పాల్గొన్న 84 శాతం మంది ఉద్యోగాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలకు పనికొచ్చే నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని, వాటిని అందుకోవడం కూడా కష్టంగా ఉందని సర్వేలో పాల్గొన్న 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. నైపుణ్యాలు పెంచుకులేకపోతే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందుకోవడం కష్టమని 92 శాతం మంది తెలిపారు. ప్రస్తుతం తాము పని చేస్తున్న సంస్ధలు స్కిల్స్ పెంచుకునేందుకు అవకాశం కల్పించకపోతే మరో ఉద్యోగం చూసుకునేందుకు సిద్ధమని 61 శాతం మంది ఉద్యోగులు తేల్చేశారు.