ఏపీలో బ్యాక్లాగ్ టీచర్ పోస్టుల భర్తీ: త్వరలో నోటిఫికేషన్: సిలబస్లో మార్పులు ఎందుకంటే?
అమరావతి: రాష్ట్రంలో ప్రాథమిక విద్యాశాఖలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. మొత్తం 403 బ్యాక్లాగ్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వాటిని భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని నిర్వహించిన వెంటనే రెగ్యులర్ డీఎస్సీకి వెళ్లొచ్చని చెబుతున్నారు. రెగ్యులర్ డీఎస్సీ ద్వారా 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తుందని సమాచారం. డీఎస్సీ నిర్వహించడానికి ముందే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)ను నిర్వహిస్తారని తెలుస్తోంది.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టబోతోన్నందున టెట్ సిలబస్ పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చని అంటున్నారు. ఈ దిశగా ఎస్సీఈఆర్టీ సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసిన ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టొచ్చని సమాచారం. బ్యాక్లాగ్ ద్వారా ఇదివరకు డీఎస్సీల్లో మిగిలిపోయిన రిజర్వుడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం విద్యాశాఖకు ఇదివరకు అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లో వాటిని భర్తీ చేయడానికి వీలు కుదరలేదు.
తాజాగా మరోసారి ఈ అంశాన్ని పునః ప్రారంభించబోతోన్నారు విద్యాశాఖాధికారులు. జిల్లాలు, రోస్టర్ వారీగా బ్యాక్లాగ్ పోస్టులను కేటాయించిన అనంతరం పరిమితంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనేది అధికారుల అభిప్రాయం. మొత్తం 403 బ్యాక్లాగ్ పోస్టులను దీని ద్వారా భర్తీ చేస్తారు. ఈ బ్యాక్లాగ్ పోస్టులకు అర్హులైన రిజర్వుడ్ అభ్యర్థులు లేకపోతే వాటిని జనరల్ కోటా కిందికి తీసుకొస్తారు. అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వల్ల మిగిలిపోయిన డీఎస్సీ ఖాళీలను తదుపరి సాధారణ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశాలున్నాయి. రెగ్యులర్ డీఎస్సీ కింద రాష్ట్రవాప్తంగా 8,700 కొత్త ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయొచ్చని తెలుస్తోంది.