గ్రూప్-1 నోటిఫికేషన్ అప్పుడే.. కొత్త పోస్టులపై జీవోలు ఇచ్చాకే నోటిఫికేషన్ కు ఛాన్స్!!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం కొలువుల జాతర ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగార్థులు ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో వివిధ పోస్టులకు సంబంధించి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ విషయంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం కానుంది. గ్రూప్ వన్ నోటిఫికేషన్ గురించి చర్చించి, ఆ తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించిన కీలక ప్రకటన చేయనుందని నిరుద్యోగులు భావిస్తున్నారు.కానీ గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీలో జాప్యం?
అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈరోజు జారీ అవుతుందా అన్న ఆలోచనలో ఉన్న నిరుద్యోగులకు టిఎస్పిఎస్సి అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. కొత్త పోస్టులకు సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్ ల నుండి పూర్తిస్థాయి సమాచారం లేకపోవడం వల్లనే నోటిఫికేషన్ ఆలస్యమవుతోందని టిఎస్పిఎస్సి అధికారులు చెబుతున్నారు. గతంలో అనేకమార్లు టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ ల విషయంలో న్యాయ పరమైన చిక్కులు వచ్చిన నేపధ్యంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారు.
కొత్త పోస్టుల విషయంలో జీవోలు ఇస్తేనే నోటిఫికేషన్ కు ఛాన్స్
రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపగా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 19 రకాల ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ పోస్టుల లో 2,3 శాఖలకు సంబంధించిన పోస్టులు కొత్త పోస్టులు కావడంతో, ఆయా శాఖల వారు ముందుగా వాటి కోసం అధికారిక జీవోలు ఇవ్వవలసి ఉంది. అయితే ఆ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. అధికారికంగా జీవోలు ఇచ్చిన తర్వాతే వాటిని భర్తీ చేసే అవకాశం ఉన్న కారణంగా మరోమారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ జాప్యం జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆలస్యం అయ్యే ఛాన్స్
ఇదిలా ఉంటే టిఎస్పిఎస్సి పూర్తిస్థాయి కమిటీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం జరగనున్న నేపథ్యంలో, గ్రూప్ వన్ నోటిఫికేషన్ పై, అలాగే పలు న్యాయపరమైన సమస్యలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు చర్చించనున్నారు. అయితే ఈరోజు జరుగుతున్న సమావేశం రెగ్యులర్ సమావేశం అని, దీనికి పెద్దగా ప్రాధాన్యత లేదని టిఎస్పిఎస్సి వర్గాలు చెబుతున్న దానిని బట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.