నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన హెచ్సీఎల్... త్వరలో 20వేల నియామకాలు...
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలై ఉద్యోగ,ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో ఆయా రంగాల్లో మళ్లీ ఉద్యోగాల కల్పన మొదలైంది. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
వచ్చే ఆర్నెళ్లలో దాదాపు 20వేల నియామకాలు చేపట్టనున్నట్లు హెచ్సీఎల్ ప్రకటించింది. ప్రస్తుతం డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతుండటం... ఆ దిశగా హెచ్సీఎల్ భారీ ఒప్పందాలు కుదుర్చుకోవడంతో కొత్త ఉద్యోగాల కల్పనను చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీఈవో విజయ్ కుమార్ వెల్లడించారు.
'మూడో త్రైమాసికంలో దాదాపు 6500 నియామకాలు చేపట్టాం. ప్రస్తుత డిమాండ్ రీత్యా మరింత మంది ఫ్రెషర్స్తో పాటు ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్ నియామకాలను కొనసాగిస్తున్నాం.' అని విజయ్ కుమార్ తెలిపారు. రాబోయే త్రైమాసికాల్లో వీసా సమస్యలేమైనా తలెత్తుతాయా అన్న ప్రశ్నకు... అమెరికాలోని తమ ఉద్యోగుల్లో 69.8శాతం మంది స్థానికులేనని చెప్పారు. తమతో పాటు చాలా కంపెనీలు వీసా వర్కర్స్పై ఆధారపడే బదులు స్థానిక నియామకాలనే పెంచుతున్నామన్నారు.
గత త్రైమాసికంలో హెచ్సీఎల్లో లోకల్ కోటా ఉద్యోగాల సంఖ్య 60శాతం నుంచి 70శాతానికి పెరిగిందని... కాబట్టి వీసాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోయిందని విజయ్ కుమార్ తెలిపారు. గడిచిన కొన్నేళ్లుగా హెచ్సీఎల్ శ్రీలంక,వియత్నాం తదితర దేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టింది. శ్రీలంకలో రాబోయే 18 నెలల్లో 5వేల ఉద్యోగాలు కల్పించనుంది. అలాగే వియత్నాంలో రాబోయే మూడేళ్లలో 3వేల నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
నోయిడా కేంద్రంగా పనిచేసే హెచ్సీఎల్ 2020 నాటికి 10 బిలియన్ డాలర్ల మైల్ స్టోన్కి చేరింది. డిసెంబర్ 31,2020 నాటికి హెచ్సీఎల్లో 1,59,682 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.