New Labour Codes:ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. వారంలో మూడు రోజులు సెలవులు..!
ఇక పై ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పనుంది కేంద్రం. ఇప్పటి వరకు చాలా కంపెనీల్లో ఐదురోజులు పనిదినాలు ఉండేవి. తాజాగా పనిదినాలను నాలుగు రోజులకు కుదిస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు సమాయాత్తమవుతోంది. అయితే ఈ ఆప్షన్ కంపెనీలకే వదిలేస్తోంది. నాలుగు రోజుల పనిదినాలకు కంపెనీ ఓకే అనుకుంటే ఆమేరకు అమలు చేయొచ్చని కేంద్రం తెలిపింది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక కూడా పెట్టింది. నాలుగు రోజులు పనిదినాలు ఎంపిక చేసే కంపెనీలు తమ ఉద్యోగస్తులకు పనివేళలు పెంచే అవకాశాలున్నాయి.
చాలా కంపెనీలు నాలుగు రోజుల పనిదినాలకు ఆమోదం తెలిపాయని కార్మికశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర చెప్పారు. కొన్ని కంపెనీ యాజమాన్యాలు మాత్రం ఐదు రోజుల పనిదినాలకే మొగ్గు చూపాయని చెప్పారు. అయితే వారంలో 48 గంటల మేరా పనివేళలు ఉండాలని అంతకు మించి ఉండరాదని అపూర్వ చంద్ర తెలిపారు. అయితే ఒక వేళ పనిదినాలను నాలుగురోజులకే పరిమితం చేస్తే ప్రస్తుతం ఉన్న పనివేళలను పొడిగించాల్సి ఉంటుందని చెప్పారు. అలా చేస్తే నాలుగు రోజుల తర్వాత వరుసగా మూడురోజులను సెలవు దినాలుగా ప్రకటించాల్సి ఉంటుందని అపూర్వ చంద్ర చెప్పారు. ఈ క్రమంలోనే నాలుగు రోజులా, ఐదు రోజులా, లేదా ఆరు రోజులా అనేది కంపెనీల ఇష్టం మేరకే ఉంటుందని చెప్పారు.
ఇదిలా ఉంటే నాలుగు రోజులు పాటు పనిదినాలు కుదించి ఆ తర్వాత మూడు రోజులు సెలవు దినాలుగా ప్రకటించకుంటే యూనియన్లు వ్యతిరేకిస్తాయని అపూర్వ చంద్ర తెలిపారు. సెప్టెంబర్ 2020లో నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంటు పాస్ చేసింది. ఆ తర్వాత ముసాయిదా నిబంధనలను డిసెంబర్లో రూపకల్పన చేసింది. అయితే దీనిపై అభ్యంతరాలను జనవరిలో కేంద్రానికి అందాయి. ఇక కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్మిక చట్టాలకు తుది మెరుగులు అద్దుతోందని చెప్పారు. అదే సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ నిబంధనలతో ముందుకొస్తున్నాయని గుర్తు చేశారు. ఈ కొత్త చట్టాలతో భారత్లో ఉద్యోగాలు పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ... ఈ చట్టాల వల్ల ఉద్యోగస్తులకు మేలు జరుగుతుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా లేబర్ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగస్తుల నియామకంతో పాటు వారిని తొలగించే ప్రక్రియ కూడా సులభతరంగా మారనుంది.అంతేకాదు యూనియన్లు ఒకవేళ స్ట్రైక్కు దిగాలంటే 60 రోజుల ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగస్తులు లేదా కార్మికుల భవిష్యత్తుపై నీలినీడలు అలుముకునే అవకాశాలున్నాయని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.