గుడ్న్యూస్: 35 వేల మంది ఫ్రెషర్లకు జాబ్స్.. భారత ఐటీ కంపెనీ..
అసలే కరోనా.. ఆపై మాంద్యం.. దీంతో కొత్తగా ఉద్యోగ అవకాశాలు తక్కువే.. కానీ దేశంో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఫ్రెషర్ల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 35 వేల మంది గ్రాడ్యుయేట్లను కొత్తగా నియమించుకోవాలని భావిస్తోంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 78 వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. గత ఆరు నెలల్లో 43 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. క్వార్టర్2లో నికర ప్రాతిపదికన 19,690 మంది ఉద్యోగులను ఇప్పటికే పిలప్ చేసుకుంది. సెప్టెంబర్ 30 నాటికి టీసీఎస్ లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,28,748కు చేరింది. టీఎసీఎస్ ఉద్యోగుల్లో మొత్తం సంఖ్యలో 36.2 శాతం మహిళ ఉద్యోగులు ఉన్నారు. టీసీఎస్ అట్రిషన్ రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో 11.9శాతంకి పెరిగింది. ఐటీ ఇండస్ట్రీలో ఇదే అత్యల్పం.
గత త్రైమాసికంలో ఇది 8.6% శాతం ఉంది. అట్రిషన్ స్థాయిలపై కంపెనీల్లో ఆందోళన నెలకొంది. రాబోయే రెండు మూడు త్రైమాసికాల వరకు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కంపెనీ భావిస్తోంది. కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు 70 శాతం మంది టీసీఎస్ ఉద్యోగులు పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. 95 శాతం కంటే ఎక్కువ మంది కనీసం ఒక డోసు వేయించుకున్నారు. పూర్తిడోసులు తీసుకున్న ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రప్పించేందుకు అవసరమైన ప్రణాళికలను కంపెనీ సన్నద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి పూర్తిగా టీకాలు తీసుకున్న సీనియర్ స్థాయి ఉద్యోగులను మాత్రమే ఆఫీసులకు అనుమతించినట్టు ప్రకటనలో వెల్లడించింది.