మాల్ ప్రాక్టీస్ ఎఫెక్ట్: టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(టీఎస్ఎస్పీడీసీఎల్) జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దయ్యింది. జూలై 17న 1000 పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది.
హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘట్కేసర్ పరీక్ష కేంద్రంలో ఫోన్తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. మాల్ ప్రాక్టీస్కి పాల్పడుతూ అభ్యర్థి పట్టుబడటంతో ఈ అక్రమాలు వెలుగుచూశాయి.
పరీక్షలో తమకు సమాధానాలు చెబుతామని డబ్బులు తీసుకుని మోసం చేశారని అభ్యర్థి వాపోయాడు. రూ.లక్షలు తీసుకుని మోసం చేశారని కొందరు ఉద్యోగులపై అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు ఏడీఈలతో సహా ఐదుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పాత్ర ఉన్న ఐదుగురు ఉద్యోగులను సస్పెన్షన్ చేశామని ఆ సంస్థ సీఎండీ తెలిపారు. కొత్త నోటిఫికేషన్ త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ వెల్లడించారు.