67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు - జోన్ల ప్రకారం విభజన : నోటిఫికేషన్లు ఎప్పుడంటే..!!
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల నిరుద్యోగులు ఆశగా నిరీక్షిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.అయితే, ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేస్తారని చెబుతున్నా..అది ఆచరణలో సాధ్యపడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించింది. కొత్త జిల్లాలు.. కొత్త జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజన ప్రారంభించింది. ఇది పూర్తయిన తరువాతనే ఖాళీలపై స్పష్టత రానుంది.
67 వేల పోస్టుల భర్తీ దిశగా
ఆ తరువాతనే, నియామకాలకు సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రా వ్యాప్తంగా 67 వేలకుపైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి..నోటిఫికేషన్ల జారీకి మరింత సమయం ఖాయంగా కనిపిస్తోంది అప్పటి వరకు రాష్ట్రంలోని 8 లక్షల మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. ఒక్క పాఠశాల విద్యాశాఖ మినహా మిగతా శాఖల వివరాల సేకరణ ఇదివరకే పూర్తికాగా.. ఇప్పుడు ఆ శాఖ లెక్క కూడా తేలింది.
నోటిఫికేషన్ల ప్రక్రియ ఆలస్యం
ఆర్థిక శాఖ క్షేత్రస్థాయి నుంచి సేకరించిన లెక్కల ప్రకారం 67,820 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆగస్టులో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్కు నివేదించింది. మరోసారి వాటిని పరిశీలించే ప్రక్రియను చేపట్టారు. అది పూర్తయితే ఈ వారంలోనే వివిధ శాఖల్లో ఖాళీలపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. ఆ తర్వాత అంటే వచ్చే నెల్లో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతుంది. వీలైతే ఈ నెలలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజన
ఇప్పటివరకు ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాల ప్రకా రం కేటాయించడం, అందుకోసం వారికి ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియను వచ్చే నెలలో చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఉద్యోగులు పనిచేస్తున్న పోస్టులు మాత్రమే కాకుండా శాఖల వారీగా మంజూరైన పోస్టులన్నింటినీ ఆప్షన్లకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలు కూడా అదే డిమాండ్ చేశాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్ల ప్రకారం వాటిని కేటాయించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రాథమిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది.
విద్యా శాఖలోనూ భారీగా ఖాళీలు
సంబంధిత జిల్లా, జోన్, మల్టీ జోన్లోని పోస్టులను స్థానికత ఆధారంగా కేటాయిస్తారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల లెక్క తేలింది. ఇక జిల్లాల వారీగా విభజన చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరు ఏ జిల్లా పరిధిలోకి వస్తారనేది ధ్రువీకరిస్తారు. ఉమ్మడి జిల్లాల లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు. అయితే చాలామంది పదవీ విరమణ, ఇతర కారణాల వల్ల వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం విద్యాశాఖలో వివిధ కేడర్లలో 18,927 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు.
జనవరిలో నోటిఫికేషన్లకు ఛాన్స్
అయితే వీటిలో 12,225 పోస్టులను భర్తీ చేసే అవకాశముందని చెబుతున్నారు. జనవరి నెలాఖరు నాటికి ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతాయనేది ఒక అంచనాగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ పైన ప్రతిపక్షాల నుంచి రాజకీయంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో..సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం నిరుద్యోగులు సైతం నిరీక్షిస్తున్నారు.