ఈ రెండు ప్రధాన రంగాల్లో ఉద్యోగాలు: బడ్జెట్లో నిర్మలమ్మ ఫోకస్ పెట్టాల్సిందే..!
బడ్జెట్ సమావేశాలకు సమయం దగ్గరపడుతోంది. అయితే ఈ బడ్జెట్ ఎలా ఉండాలో, ఏ రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందో నిపుణులు సూచిస్తున్నారు. ఇక దేశంలో చర్చ జరుగుతున్న ప్రధానాంశాల్లో ఒకటి ఉద్యోగాలు లేదా ఉపాధి. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వాలు ఏం చేయాలి, కరోనా కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఈ సారి బడ్జెట్లో ఉద్యోగాల కల్పనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశ ఆర్థిక ప్రగతి కోసం ఆయా ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన చేపట్టాలి. ప్రభుత్వాలు అధికారంలో ఉండాలన్నా తిరిగి రావాలన్న ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా దేశ యువతకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు వెనుకడుగు వేయరాదు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉద్యోగాల కల్పన విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగం, సేవా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు లేదా కార్మికులు అవసరం పడే అవకాశం ఉన్నందున ఈ రెండు రంగాలపై నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలు అధిక సంఖ్యలో కల్పించేలా కృషి చేయాలని కోరుతున్నారు.
కరోనా వైరస్ కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని అట్టి వారు తిరిగి కొత్త ఉద్యోగాల వేటలో పడ్డారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగాల కల్పనపైనే ప్రధానంగా ఫోకస్ చేయాలని ప్రభుత్వాన్ని నిపుణులు కోరుతున్నారు. ఇందుకోసం మానుఫాక్చరింగ్ రంగం కచ్చితంగా మంచి ఛాయిస్ అవుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే సేవారంగం కూడా ఉద్యోగాల కల్పనకు మంచి వేదికగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో ఒక్క సేవా రంగంలోనే 40శాతం ఉద్యోగాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఈ రంగంపై కూడా ప్రభుత్వం దృష్టి పెడితే మంచి ఉద్యోగాలు కల్పించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మానుఫాక్చరింగ్ మరియు సర్వీస్ రంగాలకు ఈ బడ్జెట్లో పెద్ద పీట వేస్తే ఉద్యోగాల కల్పన సులభతరం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. దేశంలో మూడింట రెండో వంతు ఉద్యోగాలు ఈ రెండు రంగాల నుంచే ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేశారు.