Union Budget 2021: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగస్తులకు బడ్జెట్లో గుడ్ న్యూస్..?
రానున్న బడ్జెట్లో వర్క్ ఫ్రమ్ హోం చేసే వేతన ఉద్యోగస్తులకు ప్రభుత్వం కాస్త ఊరట కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో చాలా ఆఫీసులకు మూతపడ్డాయి. దీంతో వర్క్ ఫ్రం హోమ్ అనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. ఇంటి నుంచి పనిచేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ ఉద్యోగస్తులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి.
అయితే ఉద్యోగస్తులకు ఆయా సంస్థలు ఇచ్చిన అలవెన్సులపై కూడా పన్ను పడుతోంది. అంటే కాస్ట్ టూ కంపెనీ కాకుండా ఇతర అలవెన్సులు అంటే ఇంటి అద్దె, యూనిఫారం అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, మీల్ కూపన్స్, వోచర్ల పై పన్ను అధికంగానే ఉంటోంది. ఇంటి నుంచి పనిచేసే వారిపై కూడా ఈ పన్ను విధించడం జరుగుతోంది.
అయితే చిన్న లేదా మధ్య తరహాలు పన్ను చెల్లించే పన్నుదారులకు ఈ సమయంలో వీటిపై పన్ను లేకుండా చూస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు వేతనం పొందే ఉద్యోగస్తులకు పలు అలవెన్సులపై మినహాయింపు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఒక వేళ ఆఫీసులకు వచ్చి అక్కడి సదుపాయాలు వినియోగించుకుంటున్నట్లయితే పన్ను విధించడం సబబుగానే ఉంటుందని అయితే ఇంటి నుంచి పనిచేస్తున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు ఇస్తే ఉద్యోగస్తులకు ఆ డబ్బు ఆదా అవుతుందని టాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాక్డౌన్ కారణంగా ఇంటి నుంచి పనిచేయాల్సి రావడంతో ఉద్యోగస్తులు అదనపు ఖర్చులు చేతినుంచి పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు.అయితే చాలా కంపెనీలు ఈ డబ్బులను రీఇంబర్స్ చేశాయి.అయితే ఇలాంటి రీఇంబర్స్మెంట్పై కూడా పన్నులు విధించడం బాధాకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో కొంత ఊరట కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.