భాద్రపద మాసంప్రత్యేకత, విశేషాలు తెలుసుకోండి
డా.యం.ఎన్.చార్య-
శ్రీమన్నారాయణ
ఉపాసకులు
,ప్రముఖ
అంతర్జాతీయ
జ్యోతిష
పండితులు
-9440611151
జ్ఞాననిధి
,
జ్యోతిష
అభిజ్ఞ
,
జ్యోతిష
మూహూర్త
సార్వభౌమ"ఉగాది
స్వర్ణ
కంకణ
సన్మాన
పురస్కార
గ్రహీత"
ఎం.ఏ
జ్యోతిషం
-
పి.హెచ్.డి
"గోల్డ్
మెడల్"
,ఎం.ఏ
తెలుగు
(ఏల్)
,
ఎం.
ఏ
సంస్కృతం
,
ఎం.ఏ
యోగా
,
యోగాలో
అసిస్టెంట్
ప్రోఫెసర్
శిక్షణ
,ఎం.మెక్
ఎపిపి,
పి.జి.డిప్లమా
ఇన్
మెడికల్
ఆస్ట్రాలజి
(జ్యోతిర్
వైద్యం)
,
పి.జి.డిప్లమా
ఇన్
జ్యోతిషం,
వాస్తు
,
మరియు
రత్న
శాస్త్ర
నిపుణులు.
సునంద
రాజన్
జ్యోతిష
,జాతక,వాస్తు
కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
హైదరాబాద్: సోమవారం(10/09/2018) నుంచి భాద్రపద మాసం ప్రారంభం అయ్యింది. అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి పండగ. కాని వరాహజయంతి, వామనజననం, రుషిపంచమి, ఉండ్రాళ్ల తద్దె, పితృ దేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్షం... ఇలా మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం 'భాద్రపద మాసం'. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం ఆరవమాసం అవుతుంది.ఈ మాసం లోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడం వలన ఈ మాసానికి 'భాద్రపద మాసం ' అనే పేరు ఏర్పడింది.భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం.
భాద్రపద మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా కృష్ణ పక్షం పితృ దేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు శ్రీ మహా విష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీ మన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.
అందుకే ఈ మాసంలో 'దశావతార వ్రతం' చేయాలనేది శాస్త్ర వచనం. భాద్రపదమాసంలోని అష్టమి శ్రీ కృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈనాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధా కృష్ణులను పూజించాలి. ఈ రోజును 'రాధాష్టమి' అని పేరు. ఈ రోజు రాధా కృష్ణులను పూజించడం వలన సంసార సుఖం లభిస్తుందని భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
మహాలయ పక్షం:-
భాద్రపద మాసం లోని కృష్ణ పక్షం పితృ దేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృ పక్షం అని పేరు. ఈ పక్షానికే 'మహాలయ పక్షం' అని పేరు. ఈ పక్షం శుభ కార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో పదిహేనురోజులపాటు పితృ దేవతలకు తర్పణాలు వదలడం శ్రాద్ధ విధులను నిర్వహించడం పిండ ప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడం వలన గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.
భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు
హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం
భాద్రపద శుక్ల పక్ష తదియనాడు సువర్ణ గౌరీ వ్రతం (తదియ నోము ) పదహారు కుడుముల తద్ది ఆచరిస్తారు. శివ పార్వతులను పూజించి పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను.ఈ పూజను కన్యలు పాటించడంవలన వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడం వలన వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.
ఉండ్రాళ్ళ తద్ది
భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం . తెల్లవారు జామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో ఊగుతారు.
శుక్ల చవితి :- వినాయక చవితి.మనం
ఏ పూజ చేసిన వ్రతం చేసినా చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను 'వినాయక చవితి' లేదా ' గణేశ చతుర్ధి' పర్వదినంగా జరుపుకుంటాము. ఈ రోజు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామి వారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాలతో పూజించి ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.
శుక్ల ఏకాదశి :- పరివర్తన ఏకాదశి
తొలి ఏకాదశి నాడు క్షీరాబ్దిపై శేషతల్పం మీద శయనించిన శ్రీ మహా విష్ణువు ఈ దినమున ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి 'పరివర్తన ఏకాదశి' అని 'విష్ణు పరివర్తన ఏకాదశి' అని 'పద్మ పరివర్తన ఏకాదశి' అని పేరు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కరువు కాటకాలు రావని ఒకవేళ వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు.
శుక్ల ద్వాదశి :- వామన జయంతి
దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీ మహా విష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజు వామనుడిని పూజించి వివిధ నైవేద్యములు సమర్పించి పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.
శుక్ల చతుర్డశి :- అనంత చతుర్ధశి
అనంతుడు అనేది శ్రీ మహా విష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీ మహా విష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే 'అనంత చతుర్దశి వ్రతం' లేదా ' అనంత పద్మనాభ వ్రతం' అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీ కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.
కృష్ణ పక్ష ఏకాదశి :- అజ ఏకాదశి
అజ ఏకాదశికే 'ధర్మప్రభ ఏకాదశి' అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యా బిడ్డలను పోగొట్టుకుని కాటి కాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం.ఈ ఏకాదశి నాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనె గింజలు దానం చేయాలని శాస్త సూచన.
మనకు ఈ భాద్రపద మాసంలో వచ్చే ప్రత్యేక దినాలలో మనం గమనించ వలసినసినది ఏమిటనగా దాన ధర్మములు విరివిగా చేస్తే పుణ్యఫలం సిద్దిస్తుంది.అలా చేయడం వలన తనకు తన కుటుంబానికి మంచి కలుగుతుందని శాస్త్రం సూచిస్తున్నది.