దేవి నవరాత్రులు.. దుర్గామాత అలంకరణలు
డా.యం.ఎన్.చార్య, హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వరకు గల తొమ్మిది రాత్రులను దేవి "శరన్నవరాత్రులు" నవ రాత్రులు అని వ్యవహరిస్తారు. కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతోకూడ అడవులు తిరుగుచు కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజావిధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరల తన ఐశ్వర్యమును పొందెనని ఐతిహాసిక కథ ఉంది.
ఈ కథను బట్టి ప్రజలు దుర్గ ,లక్ష్మి ,సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని మూడేసి దినముల చొప్పున పూజిస్టారు . ఈ తొమ్మిది రాత్రులయందును ఆ దేవతలను పూజించుటకు వీలుకానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధిప్రకారము పూజిస్టారు. ఆవిధంగా పూజించుటచే ఆ దినము మహానవమి అనియు సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతి పూజాదినము అని ఆయుధములను పెట్టి పూజంచుటచే ఆయుధ పూజాదినము అనియు చెప్పబడును.మర్నాటి దశమి తిథికి విజయదశమి అని పేరు.
నవరాత్రి ఉతవాలలో ఆలయాలలో పార్వతీదేవి అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ ముస్తాబు చేస్తారు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పేర్లు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో
మొదటి రోజు శైల పుత్రి,
రెండవ రోజున బ్రహ్మచారిణి,
మూడవ నాడు చంద్రఘంటాదేవి,
నాల్గవ రోజున కూష్మాండాదేవి,
అయిదవ రోజున స్కందమాత,
ఆరవ రోజున కాత్యాయినీ,
ఏడవరోజున కాళరాత్రి,
ఎనిమిదవ రోజున మహాగౌరి,
తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు.
కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనక దుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.ప్రాంతాలు వేరైనా అమ్మవారి పేర్లు వేరైనా భక్తుల భక్తీ ఒక్కటే,అమ్మవారి అనుగ్రహం ఒక్కటే నిష్టతో కొలిచిన భక్తులకు అమ్మ అనుగ్రహం అనిర్వచనీయం.