దుర్గాష్టమి పూజలు.. ఇతి బాధలు తొలగడానికి ఏం చేయాలంటే..
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
నవరాత్రుల్లో ఎనిమిదో రోజున దుర్గాష్టమిని జరుపుకుంటాం. దుర్గాష్టమి రోజున ఆయుధాలకు ఎందుకు పూజ చేస్తారో పూర్వాపరాలు గమనిద్దాం.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు.ఎనిమిదవ రోజు అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం.ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.
పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు.
మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.
దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. నవరాత్రుల్లోని తొలి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
కానీ మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవి పూజించలేని భక్తులు దుర్గాష్టమి, విజయదశమి నాడు పూజ చేస్తే అష్టైశ్వర్యాలతో కూడిన సుఖజీవితం లభిస్తుంది. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. దుర్గాష్టమి రోజును ఆయుధాలకు, వాహానాలకు పూజ చేస్తారు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గా దేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
పంచప్రక్రుతి మహాస్వరూపాలలో దుర్గావేది మొదటిది. బవబంధాలో చిక్కుకున్న మానవుడని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాధిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయనం చెయ్యాలి. '' ఓం దుం దుర్గాయైనమ:'' అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి. ఈ దినం ''ఆయుధ పూజ లేక అస్త్రపూజ '' చేస్తారు.
తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.
వ్యాపారులు తమ షాపులు,వ్యాపార సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు.వాహానాలను శుభ్రపరచుకుని మంచిగా పసుపు ,కుంకుమ పూలతో అలంకరించుకుని పుజిస్తారు నిమ్మకాయ,కొబ్బరికాయ,గుమ్మడికాయలతో దిష్టి తీసి కొడతారు.కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు.సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలి.శక్తి కొలది గోమాతకు ఏదైనా గ్రాసం తినిపించి మూడు ప్రదక్షిణలు చేస్తే మంచిది.