శివాలయాల్లో ప్రదక్షిణలు అలా చేయకూడదంట.. అన్ని ఆలయాల్లో మాదిరిగా చేస్తే..
డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151
దేవాలయానికి మానవ దేహానికి అవినాభావ సంబంధం ఉంది.దేవాలయానికి వెలితే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది.ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకునే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు తమ వీలునుబట్టి ఎక్కువ ప్రదక్షిణలు చేస్తే కొందరు మనసా ,వాచ,కర్మన అని త్రికరణ శుద్ధికి ప్రతీకగా " 3 " ప్రదక్షిణలే చాలని చెప్పి అనంతరం దైవదర్శనం కోసం వెళ్తారు.
ఈ క్రమంలో వేరే ఏ దేవుడి గుడికైనా వెళ్లినప్పుడు భక్తులు అలా తమ వీలును బట్టి ప్రదక్షిణలు చేయవచ్చును కానీ శివుడి గుడికి వెళ్లినప్పడు మాత్రం ఆన్ని గుళ్ళలో చేసినట్టు కాక ఒక క్రమ పద్ధతిలోనే ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.
శివాలయంలో గర్భ గుడిలో ఉన్న శివునికి ఎదురుగా నంది ఉంటుంది. పక్కనే లింగాన్ని అభిషేకించిన జలం వెళ్తూ ఉంటుంది. దాని కిందే చండీశ్వరుడు కొలువై ఉంటాడు. శివాలయంలోకి వెళ్లగానే నేరుగా శివుని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు ముందుగా నందీశ్వరుని వద్ద ప్రదక్షిణ ప్రారంభించి ఈశ్వరుని వద్దకు వెళ్లి ఆయన్ను దర్శించుకుని మళ్లీ వెనక్కి రావాలి.
ఒకసారి శంకరుణ్ణి దర్శించుకుని వెనక్కి వచ్చి నందీశ్వరుని వద్ద ఆగి అటు నుంచి గర్భగుడి మీదుగా లింగాన్ని అభిషేకించే జలం వద్దకు రావాలి. అక్కడి నుండి వెనక్కి తిరిగి నందీశ్వరుని వద్దకు వచ్చి ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఇలా 3 సార్లు చేస్తే చాలు దాంతో ఎంతో ఫలితం కలుగు తుంది.
సాధారణంగా భక్తులు దేవాలయాల్లో 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఇందులో ఒకటి గుడిలో దేవుడికి, రెండోది పూజారికి, మూడోది గుడి కట్టిన విశ్వకర్మకు. కానీ పైన చెప్పిన విధంగా శివాలయంలో ప్రదక్షిణ చేస్తే అది 10 వేల ప్రదక్షిణలతో సమానమవుతుంది. దీని గురించి లింగ పురాణంలో చెప్పారు.అయితే పైన చెప్పినట్టుగా కాక శివుని గర్భగుడి చుట్టూ గుండ్రంగా ప్రదక్షిణ చేయ కూడదు.
ఎందుకంటే లింగాన్ని అభిషేకించిన జలం వెళ్లే దారి వద్ద ప్రమధ గణాలు కొలువై ఉంటాయి. వాటిని దాటి ప్రదక్షిణ చేయకూడదు.అలా చేస్తే తప్పు చేసినట్టు అవుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తే పైన చెప్పినట్టుగా ప్రదక్షిణ చేయడం సులభమే. ఇలాంటి పద్దతులు మన పెద్దలు నిర్ణయించింది మనం పాటించాలి.పెద్దలు తెలిపిన పద్ధతులలో ఎదో అంతరార్ధం దాగిఉంటుంది.