దైవ పూజలు, వ్రతాలు, శాంతి పూజలతో.. పాప ప్రక్షాళన జరుగుతుందా?
డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151
మనకున్న మతాలూ వాటి వయస్సు ఏమిటో గమనిస్తే అర్ధం అవుతుంది.ఇస్లాం మతం వెలసి పదునాలుగు వందల నలుబది ఒక్క సంవత్సరాలు మాత్రమే.క్రిస్టియనిజం పుట్టి రెండు వేల పందొమ్మిది సంవత్సరాలు మాత్రమే మరి హిందువులు చరిత్ర,సంస్కృతి అతి పురాతనమైనది. కృతయుగం, త్రేయతయుగం, ద్వాపరయుగము,ప్రస్తుతం కలియుగం నడుస్తుంది.ఆలోచించండి ఎంత గొప్ప అతి పురాతనమైనదో హిందువుల చరిత్ర,సంస్కృతి.
హిందు మతంలో ప్రతి ఆచారం వెనక సైన్స్ ఉందో లేదో అని ఆలోచిస్తూ మానవునికి విలువైన సమయాన్ని వృదా చేసుకోవద్దు.భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలకు అనాది నుండే గొప్ప విలువలను కలిగి ఉంది.అందుకే విదేశీయులు సైతం మన సాంప్రదాయ,సంస్కృతులను ఆచరిస్తూ గౌరవిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం .మన పూర్వీకులు,బుషులు తమ నిరంతర శోధన అనుభంతో మనకు మంచి జీవితాలను అందించాలని వారు కొన్ని సూచనలను చేసారు.అమోగమైన వారి విజ్ఞతను గౌరవిస్తూ పరిపూర్ణమైన విశ్వాసంతో ఆచరిద్దాం.
మన పెద్దలు కొన్ని పద్ధతులను మనకు నేర్పిస్తారు.అలా ఎందుకు చేయాలని కొందరు వాటిని పాటించడం ఆపేస్తారు. కానీ వాటి వెనుక చాలా విషయం వుంటుంది.ఏ విషయం అయిన ఎందుకు చెప్పారు అనే ప్రశ్న వేసుకోవడం కన్నా ఆచరించడం మన ధర్మం.ఏదైనా ఓ పరమార్ధం లేనిదే మనకు చెప్పిఉండే వారు కాదేమో ..
"ఒకరికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు... చెడు మాత్రం చేయవద్దు" అని పెద్దల వచనం. ఇలా అకారణంగా పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో పట్టిపీడిస్తుందన్నారు. అంతేకాదు గత జన్మలో చేసిన ఇటువంటి పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాలని చెప్పారు. అయితే కొందరు మాత్రం గత జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని ప్రశ్నిస్తుంటారు.
దీనికి పెద్దలు ఇలా చెప్పారు... పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ రోగమొస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ వుంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.
అలాగే పూర్వ జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి.ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో పూర్వ జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి.
మనం తెలిసి చేసిన తెలియక చేసిన పొరపాటు పొరపాటే అవుతుంది.తెలియక పొరపాటున చేసిన దానికి కొంచం తక్కువ శాతం చెడు ఫలితం ఉంటుంది కాని ఫలితం అనుభవించక తప్పదు.కర్మ ఫలాన్ని ఎవ్వరు తప్పించలేరు.కాబట్టి మానవ జీవనం కొనసాగిస్తున్నప్పుడు మంచి,మర్యాద పాటించాలి.