కార్తీక మాసంలో పుణ్యస్నానాలు.. వాటితో కలిగే ఫలితాలు
డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151
కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం.జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ నెలలో సూర్యుడు తులారాశిలో వుంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం అవుతుంది.సూర్యుని ఉష్ణోగ్రత ఈ మాసం తక్కువగా ఉంటుంది. చలికాలం ప్రారంభం అవుతుంది. ఇది మనిషి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మన జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుతనం తగ్గుతుంది, బద్దకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు పెరుగుతాయి. నరాల బలహీనతవున్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటంతో అవి ఇంకా పెరుగుతాయి.వీటన్నిటికీ దూరంగా వుండటం కోసమే మన ఆరోగ్య రక్షణకోసమే ఈ నియమాలు ఆచరించే పద్ధతిలో పెట్టారు.
కార్తీకమాసంలో సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది పెద్దల నియమం. తెల్లవారు జామున లేవడం వలన ఈ కాలంలో సహజంగా వచ్చే రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చును. నక్షత్రాలుండగానే స్నానం, దైవపూజ, వగైరాల వలన బధ్ధకం వదిలి శారీరకంగా ఉత్సాహంగా వుండటమే కాక మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా వుంటుంది.
నదీ స్నానం చెయ్యాలంటే నది వరకు నడవాల్సి ఉంటుంది.నడకతో శారీరక వ్యాయామం అవుతుంది.ప్రవహిచే నదులలో సహజంగా వుండే ఓషధులే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాలలో వుండే ఓషధులను కూడా నదులు తమలో కలుపుకుని వస్తాయి.ఆ నీటిలో స్నానం చెయ్యటం ఆరోగ్యప్రదం.
తెల్లవారు ఝామున స్నానం చేసి నదిలో దీపాలు వదిలి పెడితే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా వుంటుందో వర్ణిచనలవికాదు మరి.అలాంటి దృశ్యాలను చూసి ఆసమయంలో భగవంతుని ధ్యానిస్తే మనసు ఎంత సంతోషంతో ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది.అంతేకాదు వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయిస్కాంత మండలం ఏర్పడుతుంది.వర్షాకాలం తరువాత వచ్చే ఈ కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయిస్కాంత శక్తి అపారంగా ఉంటుంది దాని వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
జ్యోతిషశాస్త్ర రీత్యా నీటి మీద,మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది.అలాంటి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ మాసానికి కౌముది మాసం అని కూడా పేరు.అలాంటి చంద్ర కిరణాలతో ఔషధులతో రాత్రంతా తడిసిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.ఈ మాసంలో ఉదయాన్నే నదుల వద్దకు చేరుకుని సంకల్పం చెప్పుకుని పితృ దేవతలను తల్చుకుని దాన ధర్మాలు చేసి దీపాన్ని వెలిగించి భగవంతుడిని కొలుచుకోవాలని కార్తీక పురాణం చెబుతోంది.
ఇక ఆయా పుణ్యనదులన్నీ కలిసేది సముద్రంలోనే కనుక కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేయాలని పెద్దలు చెబుతుంటారు. ఈ మాసం శివ ,కేశవులకు ఎంతో ఇష్టమైనది. అత్యంత మహిమాన్వీతమైన ఈ మాసంలో లోనే దీక్షలు ,వ్రతాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటారు.