వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేదారేశ్వర వ్రతం చేస్తే.. అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదా?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151

చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన కేదారేశ్వర నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది.

మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

శ్రీ కేదారేశ్వర వ్రత కథ :-

పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతముని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను. సిద్ధ-సాధ్య- కింపురుష-యక్ష-గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి.

Kedareshwar Vratam: Its rituals and traditions

ఋషులు-మునులు-అగ్ని--వాయువు-వరుణుడు-సూర్యచంద్రులు-తారలు-గ్రహాలు-ప్రమదగణాలు-కుమారస్వామి-వినాయకుడు-వీరభద్రుడు-నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల-సాల-తమలా-వకుళ-నరికేళ-చందన-పనస-జంభూ వృక్షములతోను చంపక-పున్నాగ-పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశభువనాలు పులకిస్తున్నాయి..

అట్టి ఆనందకోలాహలములలో ''భృంగురిటి'' అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనమునుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలగాగల వంది మాగాదులు శివునకు ప్రదక్షిణంచేసి నమస్కరించారు.

ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ! పరమార్ధ విదులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి యాదండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది.

కైలాసమునువదలి... శరభ శార్దూల గజములుగల నాగ గరుడ చకవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిధి మర్యాదలొనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని.

శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. మహర్షులారా! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది.

అందుకు గౌతముడు పార్వతీ.. ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవావ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని భాద్రపదమాసంలో శుక్ల అష్టమియందు ఆచరించాలి. ఆరోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను.

మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. మరియు ధాన్యరాశినిపోసి అందు పూర్ణకుంభమునుంచి ఇరువదియొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమునుగాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య-భోజ్య, నైవేద్యాదులు కదళీప్జలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలదక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించినవారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.

గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసము కైలాసమును చేరెను.

కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు.

ఆ తదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము చేయుటకు అనుఙ్ఞనిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగలపాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకోండనిపలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుఙ్ఞనియ్యవలసినదని కోరుకున్నారు.

వారిరువురు ఒక వటవృక్షంక్రింద కూర్చుని తోరముకట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనదాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు.

మరికొంతకాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యము నుండి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్జించి తీసుకొని రావలసిందని చెప్పిపంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది.

అతడు తిరిగివస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత దనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడాసొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు .. ఓయి! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు.

అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీమార్భలముతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది.

ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు.

English summary
Kedareshwar Vratam is very important in Karthika Masam. Parameshwarudu and Parvati's story is the base for This Kedareshwar Vratam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X