సంక్రాంతి సీజన్లోనే గాలి పటాలు ఎందుకు ఎగురవేయాలో తెలుసా!
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
సంక్రాంతి లేదా సంక్రమణము:- అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో వరుసగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అందు వలన సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో హేమంత ఋతువులో అతి చల్లని గాలులు, మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి నెలలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణలో అడుగు పెడతాడు. ఈ రోజు నుండే స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి.
సంక్రాంతి ప్రత్యేకతలు :-
1. సూర్యుడు తన కుమారుడైన శనిని కలిసే రోజు అంతే కాకుండా సూర్యుడు తన కోపాన్ని మర్చిపోయి తన కుమారుడు శనిని ఈ పండుగరోజు కలుస్తాడనే జానపదుల నమ్మకంలో ఉంది. కాబట్టి, స్వీట్లు పంచుతూ ప్రతి ఒక్కరూ ఆనందంతో గడపాలని చెప్తారు.
2. ఈ పండుగ చలికాలంలో రావడంచే నువ్వులు, బెల్లం తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి వంటికి వేడిని ఇచ్చే ఆహార పదార్ధాలు కాబట్టి బంధానికి మంచి ఆరోగ్యానికి గుర్తుగా ప్రత్యేకంగా ఈ స్వీట్లను పంచుతారు.
3.గాలి పటాలు ఎగుర వేయడం వెనుక చాలా కారణం ఉంది. పూర్వకాలంలో గాలిపటాలను సాధారణంగా పగలే ఎగరేసేవారు ఎందుకంటే అప్పుడు సూర్య కిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి, చల్లని గాలికి శరీరానికి ఎక్కువ ఇబ్బందిగా ఉండదు కాబట్టి గాలిపటాలు ఎగరేసేప్పుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్య కిరణాలు తాకుతాయి. సూర్యకిరణాలు మన శరీరానికి, చర్మానికి చాలా ఉపయోగకరం. శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా కొంత వరకు తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్లు పోతాయి. ఎండలో ఉండడం వలన వెచ్చని ఆహ్లాదాన్ని మనస్సుకు కలిగిస్తుంది. అందుకే గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వచ్చింది.
4. మకరజ్యోతి దక్షిణ భారతదేశ కేరళలో ఈ రోజు ప్రత్యేకమైన రోజున కష్టతరమైన కటువైన దీక్షతో మండలం రోజులు దీక్ష చేసి శబరిమల యాత్ర చేసిన భక్తులకు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చేరోజు. దేశంలో కొన్ని ప్రాంతాలలో తమ పాపాలను పోగొట్టుకోవడానికి నదుల్లో పవిత్ర స్నానాలను చేసి ఈ పండుగను జరుపుకుంటారు.
5..మకర సంక్రాంతి రోజున విధి వశాత్తు మృత్యువు సంభవిస్తే వారికి పున:ర్జన్మ అనేది ఉండదు, నేరుగా స్వర్గానికే వెళ్తారని నమ్మకం కూడా ఉంది. భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్య ఘడియలు వచ్చే వరకు వేచి ఉండి ఈ పుణ్య ఘడియలలోనే ముక్తి పొందాడు.