మానవులకు ఒక సంవత్సరం.. దేవతలకు ఒకరోజా? మూలకార్తెలో ఏం చేయాలంటే

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము :- కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన , సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు. అదే విధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటక మాసము అని అంటారు.

ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది. సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం. అనగా ఇది రాత్రి కాలం. మకరరాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం ఇక్కడి నుండి ఉత్తరాయణం. అనగా పగలుగా భావన. ఇలా భావిచినప్పుడు దక్షిణాయనమునకు చివరిది ఉత్తరాయణమునకు ముందుదైన ధనుర్మాసం ప్రాతః కాలమువలె పవిత్రమైనది.

 Moola Karthe or Dhanurmasam started on December 16th

ఈ మాసాన్ని ఖగోళ శాస్త్ర పరంగా పరిశీలించగా చంద్రుడు పౌర్ణమి రోజున మృగశిర నక్షతము నందు ఉండుట వలన, సౌరమాన ప్రకారం సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన రోజు నుండి మకరరాశిలోకి ప్రవేశించు వరకు గల మధ్య రోజులను అనగా సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు.ఈ నెల రోజుల పాటు బాలికలు , మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ అందమైన ముగ్గులు వేసి ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మలను లక్ష్మీ దేవి రూపంగా భావించి పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజింస్తారు.

చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఉరిగేస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రధం ముగ్గు తాడును ప్రక్కఇంటి వారు వేసిన రధం ముగ్గుకి కలిపి ఒక వరుసలో ముగ్గుతో రథయాత్ర చేసినట్లు ముగ్గులు పెడతారు. చలి కాలం చలిలో ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మహిళలకు ఆరోగ్య సూత్రం కొరకు వ్యాయామంగా ఉండేటట్లు చేసిన ఏర్పాటు ఇది.ఈ మాసంలో హరి దాసులు , హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరి కీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తలు చేస్తూ ఇంటింటికి తిరిగి బిక్షాటన చేస్తారు.

పురాణాలలోను , ఆయుర్వేద శాస్త్రములలో చెప్పినట్లు ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉండును. ఆరోగ్య సూత్రంగా జీర్ణ ప్రక్రియ సరిగ్గా పనిచేయవలయునని పులగము, దధ్యోజనమును తయారు చేసి దేవునుకి నివేదించి తినవలయునని నియమమును తెలియజేసారు.ఈ నెల శ్రీ మహా విష్ణువుకు ప్రీతి కరమైనది. వైష్ణవ దేవాలయములో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. " శ్రీ ఆండాళ్ పాశురాలు " చదువుతారు. బ్రాహ్మీముహూర్తంలో స్వామి వారికి పూజలు నిర్వహించి "కట్టు పొంగలి" దీనినే ముద్గలన్నం అని పప్పు పోంగలి అని కూడ అంటారు. స్వామి వారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదము పంచుతారు.ఈ మాసములో రకరకాల ప్రసాదాలు చేసి భక్తులకు ప్రసాద రూపంలో పౌష్టికాహారం అంద చేయటం జరుగుతుంది.

ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసము వరకుచలి చాలా ఉదృతంగా ఉంటుంది.చలికాలంలో మానవ శరీరాలలో ఉండే ధాతువులలో మార్పు చోటు చేసుకుంటుంది. ప్రకృతిలో మార్పు దేహంలో మార్పు వలన ఆరోగ్య సూత్రప్రకారం ఈ సమయంలో శరీరానికి పుష్టి నిచ్ఛే ఆహారము గుళ్ళలో ప్రసాద రూపంగా భీదసాదాలకి అందజేయటానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది.

విష్ణు చిత్తుడను విష్ణు భక్తునికి ఏకైక కూతురు ' గోదాదీవి ' ఈమె మంచి సౌందర్యంగలది. ప్రతి రోజు తోటలోని పూలను కోసి ఆ పూలను రకరకాలైన అందమైన మాలలుగా కట్టి మొదట తను ధరించి అద్దంలో తనప్రతి బింబాన్ని చూచుకొని మురిసి పోయి సంతృప్తి చెంది ఆ తర్వాత ఆ మాలలను పదిలంగా తండ్రికి ఇచ్చేది. ఈ విషయము గ్రహించని విష్ణు చిత్తుడు తన ఇష్ట దైవమైన శ్రీ రంగనాథ స్వామి వారికి అలంకరించంమని గుడిలోని అర్చకులు ఇచ్చేవాడు , ఆలాగే వారు స్వామి వారికి అలంకరింపజేసేవారు.

ఇదే విధంగా ప్రతి రోజూ జరగసాగింది. గోదాదేవి రంగనాధస్వామి వారిపై రోజు రోజుకూ ప్రేమను పెంచుకోసాగింది. స్వామి వారిని తన భర్తగా ఊహించుకొనేది. చివరకు శ్రీ రంగనాథ స్వామినే వివాహమాడవలెనని త్రికరణ శుద్ధిగా నిర్ణయించుకుంది. ఎప్పటివలెనే మాలలను ధరించి తన ప్రక్కననే రంగనాధ స్వామి ఉన్నట్లుగా భావించి మురిసిపోవుచుండెడిది. ఎప్పడు పరిస్థితులు ఒకే లాగ ఉండవు కధ ఒక రోజు పూజార్లు మాలలను స్వామి వారికి అలంకరించే సమయంలో పూలదండలో దాగిఉన్న ఒక పొడవాటి వెంట్రుక ఉన్నది గమనించారు. అది స్త్రీ వెంట్రుకని తెలుసుకున్నారు.

ఆ మాలలను తెచ్చిన ఆ మహాభక్తుని మందలించారు స్వామి వారికి అపవిత్రరంగా మాలలు ఇస్తావా అని విసుక్కున్నారు. జరిగిన పొరపాటుకు చింతిస్తూ విష్ణు చిత్తుడు ఇంటికివెళ్ళగా అక్కడ మాలలను అలంకరించుకుని స్వామి వారితో మాట్లాడుతున్న తన కూతురుని చూసి అమితమైన ఆగ్రహముతో చివాట్లు పెట్టి తన కోపాన్ని తట్టుకోలేక పక్కనే ఉన్నకత్తితో చంపబోగా గోదాదేవి తన ప్రేమ వృత్తాంతమును తండ్రికి తెలియజేసింది.

తండి తన కూతురు మాటలు విశ్వసించక అబద్దమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్యరూపుడుగా ఉన్న స్వామి ప్రత్యక్షమై తనది ఏమాత్రం తప్పులేదని ఆమె ధరించిన మాలలే తనకత్యంత ఇష్టమని తెలియజేసి ఆందరి సమక్షములో శ్రీ రంగనాథస్వామి తన భక్తు రాలైన గోదాదేవిని వివాహమాడాడు.

సాధారణ మానవ " స్త్రీ " సాక్షత్తు దేవున్ని తన భక్తి శ్రద్ధలతో మెప్పించి తన సంకల్ప బలాన్ని నెగ్గించుకునే వరకు పట్టు వదల లేదు. నిష్ట కలిగిన భక్తికి భవవంతుడు తన్మయుడౌతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు. నాటి నుండి గోదాదేవిని ఆండాళ్ గా పిలువ బడసాగింది. ఆండాళ్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలుగా పిలవబడుతున్నాయి.
విజయనగర సార్వభౌముడైన శ్రీ కృష్ణ దేవరాయలు"ఆముక్త మాల్యద" అనే పేరుతో గ్రంధ రచన చేసాడు. దీనినే విష్ణు చిత్తియం అని కూడా అంటారు. ఆముక్త మాల్యద అనగా 'ధరించి తీసి వేసిన పూలమాల 'అని అర్థము.

ఈ నెలలోనే వైకుంఠ ఏకాదశి "ముక్కోటి ఏకాదశి" వచ్చును. ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తన అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామి వారిని తులసి మాలల అలంకరణతో దర్శించి తరించెదరు. నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కళకళలాడుతూ కనిపిస్తాయి , ఉదయం , సాయంత్ర సమయాలలో స్త్రీలు , ముత్తైదువలు తులసికోటను అందంగా అలంకరించుకును దీపారాదన చేసి చుట్టు ప్రదక్షిణలు చేయుట వలన మనోవాంచలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి , ఇది ప్రకృతి ఆరాధనగా భావించ వచ్చు.

మానవ జీవనంలో సాత్వికమైన దైవ ఆరాధనలకు ప్రధానమైన కాలం. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'సంకృన్ని నిలపట్టడం' అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది.

మూల కార్తె ప్రవేశం :- ఈ రోజు నుండే మూల కార్తె ప్రవేశం కానున్నది వాటి ఫలితాలు : ఈ కార్తె సోమవారం ఆశ్లేష నక్షత్రంలో మధ్యాహాన్నం 3:28 నిమిషాలకు ప్రవేశిస్తుంది.ఫలితంగా ఈ కార్తెలో శీతలం అధికం ( చలి ఎక్కువగా ఉంటుంది )

రైతులు ప్రకృతిలో వాతావరణ మార్పుతో వ్యవసాయ సాగుకు వాతావరణంనకు అనుకూలంగా పంటలు దెబ్బతినకుండా సాగు చేసేవారు. భావితరాల వారికి తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో వ్యవసాయ విజ్ఞానాన్ని పదిలపరచుకున్నారు. పురుగు మందులు , జన్యుమార్పిడి విత్తనాలు , ప్రకృతి వైపరీత్యాలతో భయం గొలుపుతున్న పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతలలో చెప్పుకున్నారు.

మూల కార్తెకు సంబంధించిన సామెతలు రైతులకు ఎలా వ్యవసాయ సాగుగు ఉపయోగపడ్డాయో ఈ క్రింది ఇవ్వబడిన వాటిని గమనిస్తే తెలుస్తుంది.

మూల కార్తెకు వరి మూలకు జేరుతుంది.

మూల ముంచుతుంది.

మూల వర్షం కురిస్తే పంట పాడు.

మూల పున్నమి ముందర ఏ తెలివితక్కువోడైన విత్తనాలు చల్లడు.

మూల మంటే నిర్మూల మంటాడు.

మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.

మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది.

మూల కార్తెలో రైతులు వ్యవసాయ సాగుకు ఆచరించే పద్దతులు ఇవి :-

వరి : నారుమడికి ఎరువులు వేయుట , వరినాట్లకు పొలం తయారు చేయుట.

మొక్కజొన్న : అంతరకృషి, సస్య రక్షణ, ఎరువులు వేయుట.

గోధుమ : సస్య రక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.

రాగులు : రాగులను విత్తుట.

కాయ ధాన్యాలు : పెసర , మినుములను వరి పండించిన భూముల్లో విత్తుట , కంది కోతలు , కంది పంటగా సాగు చేయుట.

మిరప : పండు కాయలు కోయుట.

చెరకు : చెరుకు నాట్లు వేయుట.

ఉల్లి : వరి పండించిన నేలల్లో నాటుట.

వేరుశనగ : వరి పండించిన చేలలో విత్తుట.

పండ్లు : అరటికి పిలకలు తీయుట. నాటిన పిలకలకు ఎరువులు వేయుట.

ఈ విధంగా కార్తెకు అనుగుణంగా రైతులు తమ వ్యవసాయ సాగునకు కాలానికి అనుగుణంగా కృషి చేసి లబ్ది పొందుతారు.రైతులు ప్రధానంగా వ్యవసాయ సాగుగు కార్తెలపై ఆధారపడి ప్రకృతికి అనుగుణంగా పంటలు పండిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+