ముక్కనుమ నిజంగా నాన్-వెజ్ పండుగనా, శాస్త్రంలో ఆ ప్రస్తావన ఉందా?
ఈ సంక్రాంతి పండుగలో నాల్గవరోజును ముక్కనుమ అంటారు. ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకుని కుటుంబ, బంధు, మిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు. పండుగ లోని మొదటి మూడు రోజులు కేవలం శాఖహారమే భుజించాలి. ఇది ఆరోగ్యసూత్రం. మాంసాహారం తినకూడదు. ప్రకృతిలోని మార్పు వలన సప్తధాతువులతో మిలితమైన మానవ శరీరంలో కూడ మార్పు చోటు చేసుకుంటుంది. అది మానవ శరీరానికి హాని చేయకుండా ఉండేందుకే ఎక్కువ నువ్వులతో ముడిపడిన పిండి వంటకాలను ఏర్పాటు చేసారు.
మూడవ రోజున కనుమ రోజున తమ పొలాలలో నిరంతరం శ్రమించే పశువులను గౌరవించి మన జీవన ప్రయాణంలో వాటి సహాయం లేనిదే మనిషికి మనుగడ లేదు కాబట్టి కృతజ్ఞత భావంతో రైతులు ఉదయాన్నే పశువులను, వాటి పాకలను శుభ్రంగా కడిగి అలంకరించి పూజలు చేస్తారు. వాటికి ఇష్టమైన వాటిని తినిపిస్తారు. ఈ రోజు ప్రయాణాలను ఆశుభంగా భావిస్తారు.
మొదటి మూడు రోజుల్లోనూ పొంగలితో పాటు, సకినాలు, చేగోడిలు, కారపూస, అరిసెలు, అప్పాలు, నువ్వుల ముద్దలు మొదలైన పిండి వంటలు చేసి తిని ఆనందిస్తారు. సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా గాలిపటాల (పతంగుల)ను ఎగురవేసి ఆనందిస్తారు.
ఈ పండుగ రోజులలో ప్రతిరోజూ వేకువజాముననే హరిదాసులు సంకీర్తనలు చేస్తూ ప్రతి ఇంటికి తిరిగి దానములు స్వీకరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఇక గంగిరెద్దులవారు ఎద్దులకు ఆకర్షణీయ దుస్తులు, రంగులు వేసి వాటిని ఇంటి ముందుకు తెచ్చి పాటలు పాడి దానం స్వీకరిస్తారు.
కొంతమంది కనుమ రోజు మాంసాహారం తినవచ్చునని అనుకుని వారికి వారే కల్పించుకుని తినేస్తుంటారు. అది ఎంత మాత్రం సరైనది కాదు. మన భారతీయ హిందూ సంస్కృతి చాలా గొప్పనైనది. సంస్కృతి అంటే బాగుచేయునది అని అర్ధం. అనాది నుండి ప్రధానమైనది మతం - హిందూ మతము భాయాం రతా: = భారతా.. అనగా ఆత్మజ్ఞానము నందు ఆసక్తులైనవారు అని భావం.
భారతీయ సంస్కృతి అంటే వైదిక లేక సనాతనమైనదని దానికి సంబంధించినదే వాజ్ఞయం, లలితకళలు, ఆచార వ్యవహారాములు. నియమాలు, కట్టుబాట్లు అనేవి వీటి పరిదిలోకి వస్తాయి. ఈ మకర సంక్రాంతితో సూర్యభగవాణుడు ఉత్తరాయణం వైపు ప్రయణం చేయడాన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అనేవి దైవాన్ని , ప్రకృతిని, పశుపక్షాదులను అంటే మన జీవించడాని సహయపడిన వాటిని గౌరవించి వాటిని పూజించుకునే గొప్పనైన సంస్కృతిని మన పూర్వీకులు మనకు ఆచరించి తెలియజేసారు.
కాలం మారుతున్నకొద్ది మన సనాతన సంస్కృతి సాంప్రదాయలను మరచిపోతున్నాం. ఇది ఎంత వరకు మంచిది ఒకసారి ఆలోచించాలి. కనుమ అంటే పశువులను గౌరవించి పూజించే పండగా అని చెప్పుకుంటాం. అంటే సాటి ప్రాణులను గౌరవించే సంస్కారం మనలో దైవత్వం ఉంటేనే వస్తుంది. అంతలోనే మాంసాహారం తినడంలో ఎంతవరకు న్యాయమో ఆలోచించాల్సి ఉంది.
మన పెద్దలు పూర్వీకులు మన ఆరోగ్య సూత్రలను దృష్టిలో పెట్టుకుని ఆయా పండుగలలో ఆహార నియమాలను పాటించేలా చేశారు. వాటిని పెడచెవిన పెడితే ఎవరికి నష్టమనేది ఆలోచించాలి. నా ఉద్ధేశ్యం మాంసాహారం తినే వారిని వద్దని నేను చెప్పడం లేదు కాని ఈ భోగి, సంక్రాంతి, కనుమ అనే మూడు రోజుల పండగలలో మాంసాహార భక్షణ చేయాలనే నియమం ఎక్కడ లేదు. ఇది కేవలం వ్యక్తిగతంగా కల్పించుకున్నదే! జై శ్రీమన్నారాయణ.
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151