రథ సప్తమి పండగ: ఆచరించాల్సిన పద్దతులు, పూజలు.. అనారోగ్య సమస్యలు నివారణ ఇలా..
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
రథ సప్తమి లేదా మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గ మహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే చాలా ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను ( రెండు ) మానసిక, వాచిక, శారీరకములు ( మూడు ) తెలిసిచేసేవి, తెలియకచేసేవి ( రెండు ) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.
వ్రతకథ :- భవిష్యోత్తర పురాణములో రథసప్తమి గురించి వ్రత విధానాలు, విశేషమైన వర్ణనలు ఇవ్వబడ్డాయి.
ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను. పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు పండితులను అడిగెను. "నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వాడు . రథసప్తమీ మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను. లోభియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి. దీనికి పరిహారమడిగిన రాజుకు పండితులు ఎలా చెప్పారు. ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రత మాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను.
రధసప్తమి రోజు చేయవలసినవి :- వేకువఝామున లేచి ఇల్లంతా శుభ్రపరచుకుని, వాకిట్లో రధం ముగ్గు వేసుకుని ఏడు జిల్లేడు ఆకులను తలపై, భుజములపై ధరించి అభ్యంగన స్నానం చేసి ఆత్మకారకుడైన సూర్య భగవానుని మన:స్పూర్తిగా భక్తీ శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్యం నివేదన చేసి, ప్రత్యక్షంగా కనిపించే సూర్యునికి దీప, దూప, నైవేద్య ,కర్పూర హారతి ఇచ్చాక, రాగి చెంబులో శుభ్రమైన నీటితో నింపి అందులో చిటికెడు పసుపు, కుంకుమ, పంచదార, పచ్చి ఆవుపాలు కొన్ని, ఎర్రని పువ్వు చెంబులో వేసి రెండు చేతులతో చెంబును చేత పట్టుకుని రెండు చేతులను ఆకాశానికి చాచి సూర్యున్ని చూస్తూ మనస్పూర్తిగా స్వామి వారికి నమస్కారం చేస్తూ ఓం శ్రీ సూర్య నారాయణాయ నమ: అని కాని ఓం దృణి సూర్యాయ నమ: అంటూ స్మరణ చేస్తూ రాగి చెంబులో ఉన్ననీళ్ళను భూమిపైకి వదలాలి.
ఆ తరవాత సాష్టాంగ నమస్కరం చేసి మొదట ప్రసాదాన్ని తను స్వీకరించి, శుభ్రంగా చేతులు కడుక్కుని ఇతరులకు పంచాలి. ఆ తర్వాత కిలోంపావు గోధుమలు, బెల్లం, అరటి పండ్లను అరటి ఆకులోకాని ,ఆకులతో చేసిన విస్తరిలో పెట్టి అవునకు తినించాలి. గో మాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే సమస్త ఇతి భాదలు, అనారోగ్య సమస్యలు నివారణలు జరుగుతాయి.