పెద్దల తిథులు ఎప్పుడు జరుపుకోవాలి ? ఎవరు తిథి పెట్టచ్చు ? పండితులు ఏం చెప్తున్నారు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151
కొత్తగా ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేశాక ఆరునెలలకు వచ్చిన మొదటి తద్దినాన్ని కొత్త ఇంట్లో పెట్టవచ్చా? అమ్మాయికి పెళ్ళి చేశాము. కన్యాదాత తన తండ్రికి తద్దినం పెట్టవచ్చా? అబ్బాయికి ఉపనయనం చేశాము. వాడు పితృశేషం తిన వచ్చా అనే అనేక సందేహాలు చాలా మందిలో మెదలాడుతుంటాయి.
ఇంట్లో తలిదండ్రులు తెలుగు నెలలో ఏ తిథులలో స్వర్గాస్తులౌతారో అదే తిథి రోజు ఏ వారం అయినను తిథి పెట్టుకోవాలి. ఆఫీసులో సెలవు దొరకదని, ఆదివారం అయితే బాగుంటుందని కొందరు తమకు వీలు చూసుకుని తిథులు ప్రస్తుత కాలంలో పెడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు. ఇంకా కొంత మందైతే తారీకు తేదీల ప్రకారం జరుపుతుంటారు. ఇది అస్సలు సరైన పద్దతి కాదు.
ఎటువంటి పరిస్థితుల్లోనూ తద్దినాలు వచ్చిన తిథులు వదులుకోరాదు. ఆ రోజున కచ్చితంగా పెట్టేతీరాలి. అయితే పురిటిమైల,మృతా శౌచం వచ్చినప్పుడు మాత్రమే వాయిదా వేసే అధికారాన్ని శాస్త్రం ఇచ్చింది. ఇవి మినహా ఎటువంటి పరిస్థితుల్లోనూ తిథులను పాటించే తీరాలి.
కొత్త ఇల్లు, వివాహం, ఉపనయనాది సందర్భాలు జీవితంలో అభివృద్ధి కోసం వచ్చినవిగా తెలుసుకోవాలి. పురోభివృద్ధి కోసం చేసే బృహత్ ప్రయాత్నాలన్నింటికీ భగవంతుని ఆశీర్వాదాలు కోరతాము. అలాగే దేవీదేవతల సహాయాలు కలిగి నిర్విఘ్నంగా నిరాఘాటంగా విజయవంతంగా కావాలని కోరుకుంటాము. నిజానికి అటువంటి దేవీ దేవతల కన్నా మన పురోభివృద్ధి కోరుకునేవారు కన్నతల్లి తండ్రులే అని తెలుసుకోవాలి.
గృహప్రవేశం, వివాహం, ఉపనయనాదుల్లో నాందీశాద్ధములు అర్చిస్తారు. ఇవి పితృదేవతలకు శుభకార్యాల్లో, వృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో చేయవలసిన అర్చనలు. అలా ఈ సందర్భాలలో పితృలకు అభివృద్ధి శాద్ధాలను పెట్టాలి. కేవలం గృహ ప్రవేశ సమయంలో మాత్రమే కాదు. స్థలం కొన్నప్పుడు, శంకుస్థాపన చేసేటప్పుడు, ద్వారాలు ఎత్తినప్పుడు,పైకప్పు ఎత్తినప్పుడు ఇలా ప్రతీ ముఖ్య సందర్భంలో కూడా ఈ శ్రాద్ధాలను చేయడం మంచిదే.
వివాహంలో మాత్రమే కాక వివాహాలు కానప్పుడు సంతానానికి విపరీత మనస్తత్త్వాలు కలుగుతున్నప్పుడు మొదలైన ప్రతీ సందర్భంలో కూడా పితృల అర్చన చేయాలి. మన పని మాత్రం పితృలను అర్చించడమే అని గుర్తుంచుకోవాలి. వేద సాంప్రదాయం ప్రకారం ఉన్న పితృదేవతార్చనలు చేయండి. సుఖశాంతులు పొందండి.
జీవితంలో అనవసరంగా కష్టాలు పడుతున్నవారు, పురోభివృద్ధి లేనివారు, ధన సంబంధమైన ఇబ్బందులు పడుతున్నవారు, సంతాన సంబంధ నష్టాలు పొందుతున్నవారు, పిల్లలు విశృంఖలంగా తయారైనవారు, అన్ని రకాల వ్యసనాలకు బలహీనతలకు లోనైనవారు, విద్యా, వ్యాపార పురోభివృద్ధిలేని వారు, వివాహాలు కాని వారు, వివాహమై సంసారాలు గాడిలో పడనివారు, పిల్లలు కలగని వారు వీరంతా పితృ, మాతృ, దేవతా అర్చనలను నిర్లక్ష్యం చేయడం వలన ఇటువంటి బాధలు పడతారు.
వైదిక ధర్మాచరణాలు సన్నగిల్లి, విచ్చలివిడి జీవితాలు అలవాటైన కారణంగా ఈ దోషాలు కలుగుతున్నాయి. వీటన్నింటికీ కారణం పితృల శాపాలు. ఈ దోషాల నివారణకు అతి తేలికైన మార్గాలు ఉన్నాయి. పిత్రుదోష నివారణ చేసుకోవాలి. వీటిని చేస్తే సకల సంపదలూ సుఖ శాంతులూ కలుగుతాయి.
పితృల పట్ల ప్రేమ ఉన్నవారికి కూడా నేటి విపరీతమైన నవీనకాలపు జీవన విధానంలో పితృల అర్చనకు సమయం దొరకడం అసాధ్యంగా మారింది. ఈ కారణంగా కూడా వారు బాధలు పడాల్సి వస్తోంది. వీరందరికీ శాస్త్రబద్ధమైన విధానంలో పితరుల అర్చన.
అమావాస్య నాడు తల స్నానం చేసి ఆవుకు ఒక రోజు గ్రాసం ఇవ్వాలి. అంటే కేవలం యాభై రూపాయలు పెడితే పచ్చగడ్డి, చిట్టూ తవుడూ, ప్రత్తి గింజలు,గానుగ చెక్కలు వంటివి పశుగ్రాసం దుకాణాల్లో దొరుకుతాయి. వాటిని తీసుకొని పాలిథీన్ బ్యాగుల్లో కాకుండా అరటి ఆకు, విస్తరి ఆకులో ఆవులకు మేతగా వేయాలి. గోమాతలోనే సకల దేవతలు ఉంటారు. పితృలు కూడా ఆవులోనే ఉంటారు. ఆవుకు గ్రాసం వేయడం పితృలకు పిండ ప్రదానం చేయడంతో సమానం.
అమావాస్య రోజు గోమాత దగ్గరకు వెల్లి ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పులు మన్నించి నేను వేస్తున్న ఈ గ్రాసాన్ని స్వీకరించి మా పితృలకు సంతృప్తి కలిగించమని ఆవును వేడుకోవాలి. సమస్త కోటి దేవతలూ పితృదేవతార్చన ఈ విధంగా చేయడం వలన సంతృప్తి చెందుతారు. దీన్ని మించిన సకల దేవతారాధన మరొకటి లేదు. సకల సాధనలకూ ఇదే మొదటి సోపానం. అమావాస్యనాడు ఈ విధంగా చేయాలి.
అన్ని కోరికలు అడిగిన వెంటనే తీర్చేవారు పితృ దేవతలు మాత్రమే. వీరిని మించిన దైవం కలియుగంలో లేదు. సకల దేవతలు పితృలను సేవిస్తే సంతోషిస్తారు. వారిని అర్చించకుండే ఏ సాధనలు చేసినా అవి నిష్ప్రయోజనం అవుతాయి. తల్లిదండ్రులను అర్చించిన తరువాత చేసే సర్వకార్యాలూ అతి తేలిగ్గా పూర్తి అవుతాయని సకల దేవతలూ తమను అర్చించినట్టే భావించి విజయం చేకూరుస్తారని వేదాలు చెబుతున్నాయి.