కార్తీక పౌర్ణమి ఎలా ఏర్పడింది.. వ్రతాలు, పూజలు ఎలా చేయాలి? ఫలితం ఏమిటి?
డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమను కార్తీక పౌర్ణమి అంటారు.చాంద్ర మాసం రిత్య పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండటం చేత కార్తీక మాసంగా పిలవబడుతుంది.ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం.అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 'శివునికి , విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కోలిచి తరింస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి.
ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి.నెల రోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు అయితే పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు అందువలన అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాలలో దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిరి కాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందదీపం పేరుతో అఖండదీపాన్ని ఆకాశదీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణలతో ( కుండలు, లోహపాత్రలతో తయారుచేసి ) వేలాడ దీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో,నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదము,అష్టశ్వర్యాలు కలుగుతాయి.
వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే ఆనేక దీపాలవల్ల వాటి నుండి వచ్చే వాయువులు వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతవరణ శుద్ధి అవుతుంది. తద్వార మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీపేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానం కొరకు శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు.వారు చేసిన ఆరాధనలోని చిన్నలోపం వలన సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు.
అందుకే 'అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్నే కోరుకున్నారు ఆ దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులు జోరెత్తుతోంది.ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందాసాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.
ఈ పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద విల్లుకాని విల్లుతో నారికాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏక కాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు.ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్ని కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోక వాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరకు వెళ్ళమని ఉపాయం చెప్పాడు అని సలహా ఇచ్చాడు.విష్ణువు కూడా తనకా శక్తిలేదని వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు.
దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా ఆది శేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా శ్రీమహా విష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను ( మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను ) సంహరించాడని అందువలన ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం. ఈ రోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణ పరంగా మనకు ఎంతో ఆరోగ్య ప్రదం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజిలో కాని ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి దీపారాధన చేసే టైం లేనివారు ఆచరించలేని వారు ఈ పౌర్ణమి నాడు ఆచరిస్తే చాలు నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది.
ఈ రోజున స్త్రీల కోరకు ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి.పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలని చెబుతాయి.ఇలా చేయడం వల్ల కడుపు చలవ ( బిడ్డలకు రక్ష ) అని పెద్దలంటారు. ఆరోగ్య పరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమా వ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి.
వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు ఈ రోజు.
నేడు ప్రత్యేకంగా చేయవలసినవి :- దైవ దర్శనం , దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం , దీపోత్సవ నిర్వహణ విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడినది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరి హారులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందండి. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి, జైశ్రీమన్నారాయణ.