వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార ప్రవేశం.. ముక్తికి మార్గమా?
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. మార్గశిర మాసం అంటేనే ముక్తికి మార్గం అని భావం. శ్రీకృష్ణ పరమాత్మ. కార్తీకేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, వంటివారితో పాటు స్వయం భగవానుముఖతః ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు. ఈ మాసంలో ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీ మహా విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన మాసం. భగవద్గీతలోని విభూతి యోగంలో "మాసానాం మార్గశీర్షం" మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ .
ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీమూహూర్తాన నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందు వలన బ్రాహ్మీ మూహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్య ప్రదం సంధ్యా వందన జప ధ్యానాదులను నిర్వహించడం వలన సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని వికసింపజేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారు ఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది.
ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీ లక్ష్మి సమేత శ్రీ మహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి.ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి . శ్రీ విష్ణునితోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ నిరంతరం ఈ మాసంలో ఓం నమో నారాయణయనమః అనే మంత్రాన్ని స్మరించాలి, మననం చేసేవారిని కాపాడేది మత్రం అని పెద్దలు అంటారు.
ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి.ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.మార్గశిర శుద్ధ 'స్కంద షష్ఠి' శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. తెలుగు వారు దీన్ని 'సుబ్రహ్మణ్య షష్ఠి' అని అంటారు.
మార్గశిరంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార ప్రవేశం.. మోక్షం లభిస్తుందా?
మార్గశిర శుద్ధ ఏకాదశి 'వైకుంఠ ఏకాదశి'. దీనినే 'మోక్ష్తెకాదశి' అని అంటారు. ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. యాదాద్రి ,సింహాచలం ,తిరుపతి, శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం జరుగుతుంది .వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు.
మోక్షదా ఏకాదశి "గీతాజయంతి" సమస్త మానవాళికి ధర్మ నిధి, భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు.
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిరంలోనే శుక్ల పూర్ణిమనాడు జరుపుకొంటారు.
మార్గశిర శుక్ల త్రయోదశినాడు హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి , ప్రదోష వ్రతం ఆచరించడం పరిపాటి. ఈ మాసంలోనే అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రమణ్యషష్టి, పరశురామ జయంతి, సంకటహర చతుర్ధి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫలా ఏకాదశి, కృష్ణ(మల్ల)ద్వాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోష వ్రతం, శ్రీ మహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సంక్రాంతినే "ధనుర్మాసం"అని అంటాము తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం కావున శ్రీ మన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు భక్తిభావనును పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారినిగా నిలుస్తుంది .
మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం, ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం వంటిది. బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది.
సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతీ ఒక్కరికీ కర్మయోగం, భక్తియోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్టానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలియచెప్పాడు. భగవద్గీత నిత్యపారాయణ, నిత్య ఆచరణా గ్రంథమైనప్పటికీ విశేషించి శ్రీకృష్ణుని తలచుకుని గీతాపారాయణ, గీతా అధ్యయనం, అనుష్టానం చేయాలి.మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి తమ శక్తికొలది ముత్తైదువలకి భోజనం పెట్టి పసుపు , కుంకుమ పువ్వులు , తాంబూలం మొదలగు మంగళ ద్రవ్యాలనివ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణాలు తెలియజేస్తున్నాయి జై శ్రీమన్నారాయణ..