vastu tips: దుర్గా శరన్నవరాత్రుల ముందే ఇంట్లో ఈ వస్తువులు, పదార్ధాలు బయటపడేయ్యండి!!
ఈ సంవత్సరం దేవి శరన్నవరాత్రులు నవరాత్రి సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 6 వరకు జరగనున్నాయి. దసరా శరన్నవరాత్రులలో దుర్గ మాతను ఇంటికి ఆహ్వానించటానికి ముందు చేయవలసిన పనులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని ఇంటికి ఆహ్వానించడానికి ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రత లేకుండా ఇంట్లో అమ్మవారిని పూజిస్తే శుభ ఫలితాలు ఉండవని చెబుతారు. దేవి శరన్నవరాత్రులలో కొన్ని పదార్థాలను, వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. ఇంట్లో ఈ వస్తువులు ఉంటే చాలా అశుభంగా భావిస్తారు. అవేమిటంటే..
నవరాత్రులలో ఇంట్లో ఉండకూడని పదార్థాలు ఇవే
నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారు భక్తుల ఇళ్ళలో నివాసముంటారు. అత్యంత నియమనిష్టలతో, భక్తిప్రపత్తులతో ఎవరైతే దుర్గా దేవిని పూజిస్తారో వారికి మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. నవరాత్రులలో భాగంగా ఇంట్లో వెల్లుల్లి, ఉల్లి, గ్రుడ్లు, మాంసం, చేపలు, ఆల్కహాల్ వంటి పదార్థాలు ఉంచుకోకూడదు అని చెబుతున్నారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ శరన్నవరాత్రులలో ఉపయోగించకూడదని సూచిస్తున్నారు.
ఇంట్లో పాతబట్టలు, చిరిగిన బట్టలు, ఇంకా ఇవి ఉంటే అశుభం
నవరాత్రులలో పాత బట్టలు, చిరిగిన పాత బూట్లు, చెప్పులు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. అటువంటివి ఇంట్లో ఉంటే వాటిని కచ్చితంగా బయట పారేయాలని సూచిస్తున్నారు. అంతేకాదు విరిగిపోయిన గాజు వస్తువులు, పగిలిన పాత్రలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇంట్లో ఏ మూల లోను చెత్తాచెదారం ఉండకూడదని, వ్యర్థ పదార్థాలు ఏవీ లేకుండా ఇల్లు శుభ్రంగా ఉండాలని, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కి తావు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
విరిగిన దేవతా మూర్తుల విగ్రహాలు, పగిలిన దేవుళ్ళ పటాలు .. చెయ్యాల్సింది ఇదే
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఇంట్లో విరిగిన దేవతా విగ్రహాల మూర్తులను ఉంచరాదని సలహా ఇస్తున్నారు. అటువంటి విగ్రహాలు, పగిలిపోయిన దేవుని చిత్రాల ఫ్రేమ్లు ఉంటే వాటిని తొలగించాలని సలహా ఇస్తున్నారు. వాటిని నదిలో కాని చెరువులో కాని నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు. పగిలిపోయిన విగ్రహాలను, విరిగిపోయిన ఫోటో ఫ్రేమ్ లను, ఇంట్లో పెట్టుకున్నా, ఆలయాల్లో పెట్టినా మంచిది కాదని సలహా ఇస్తున్నారు.
పాడైపోయిన గడియారాలు ఉంటే ఫలితం ఇలా
శరన్నవరాత్రుల్లో దుర్గా దేవి కటాక్షం కావాలంటే ఇంట్లో పాడైపోయిన గడియారాలను ఉంచుకోకూడదు అని సూచిస్తున్నారు. పాడైపోయిన గడియారాలు ఇంట్లో ఉంటే తక్షణం వాటిని బయటపడేయాలని చెబుతున్నారు. పని చెయ్యని పాడైపోయిన గడియారం అశుభసూచకమని ఇది పురోగతికి అవరోధం కలిగించడమే కాకుండా, మనకు కూడా బ్యాడ్ టైం ను తీసుకు వస్తుందని సూచిస్తున్నారు.
వంటింట్లో చెడిపోయిన పదార్థాలు ఉన్నాయా.. అయితే దుష్ప్రభావం
అంతేకాదు దేవి శరన్నవరాత్రుల కు ముందే వంటగదిని శుభ్రం చేసుకోవాలని, చెడిపోయిన ఆహార పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని పారేయాలని సలహా ఇస్తున్నారు . ఊరగాయలు లేదా ఏదైనా చెడిపోయిన ఆహార పదార్థాలు వంటగదిలో ఉంచినట్లయితే వాటిని తక్షణం పారేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో చెడిపోయిన ఆహార పదార్థాలను నిల్వ పెట్టుకుంటే దుర్గాదేవి కి కోపం వస్తుందని, ఆమె చిరాకు పడుతుందని చెబుతున్నారు. శుభ్రతను దుర్గాదేవి బాగా ఇష్ట పడుతుందని, శుభ్రత లేని ఇంట్లో దుర్గాదేవి నివసించదని, ఆ ఇంటి సభ్యులకు దుర్గా దేవి కటాక్షం లభించదని చెబుతున్నారు. కాబట్టి శరన్నవరాత్రులకు ముందే ఇంటిని శుభ్రం చేసుకొని, పాజిటివ్ ఎనర్జీతో దుర్గాదేవికి స్వాగతం పలకాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.