మలబద్ధకం అంటే ఏమిటి..? నివారణ మార్గాలు గురించి తెలుసుకుందాం..!
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
మలబద్దకం అనేది సమస్త రోగాలకు మొదటి మెట్టు. మలం ( సరిగ్గా జీర్ణం కాని పదార్ధం ) వాతం వలన శుష్కించి ఉండలుగా గట్టి మలమార్గము నుండి సునాయాసంగా బైటకు వెడలకున్న యెడల ఆ వ్యాధిని మలబద్దకం అంటారు. ఆయుర్వేదం నందు ఈ వ్యాదికి "ఆనాహము" అని పిలుస్తారు. మలబద్దకం సమస్య వలన నడుము, వీపు నందు పట్టుకొని ఉండటం, కడుపునొప్పి, ఆయాసము, ముఖములో మొటిమలు, దద్దుర్లు, వాంతి వంటి లక్షణాలు వస్తాయి. దప్పిక, జలుబు, శిరస్సు నందు మంట, రొమ్ము పట్టినట్లు ఉండటం, తేన్పులు పైకి రాకుండా ఉండటం వంటి లక్షణాలు కొందరిలో కనపడతాయి. మలబద్దకం సమస్య పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలు వస్తాయి.
మలబద్దక నివారణ చిట్కా మార్గాలను చూద్దాం:-
* రోజు కనీసం రెండు లేక మూడు గ్లాసుల మజ్జిగ త్రాగడం.
* పరిగడుపున లీటర్ గోరువెచ్చని నీళ్ళను త్రాగడం.
* ఉసిరికాయ తినుచున్న సుఖవిరేచనం అగును.
* కరివేపాకు పొడి అన్నంలో కలుపుకుని తినడం వలన.
* బార్లి గింజలు ఉడకబెట్టుకుని తినడం వలన.
* ఎక్కువ ఆకుకూరలు, పూదిన తినడం వలన.
* కాకరకాయ కూరను తరచుగా తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును.
మరిన్ని చిట్కాలు
* ఎండిన ఎర్రరేగుపళ్ళు తినుచుండవలెను.
* చింతపండు చారు అద్బుతముగా పనిచేయును. అతిగా తీసుకున్న విరేచనాలు కలుగచేయును .
* బాగా పండిన అరటిపండు తినుచుండవలెను.
* త్రిఫల చూర్నము రోజు రాత్రి త్రాగడం వలన.
* విరేచనం ఇబ్బందిగా ఉన్నప్పుడు 4 చెంచాల ఆముదం కొంచం వేడిచేసి లోపలికి తీసికొనవలెను. ఆముదం తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నచో ఒక కప్పు గొరువెచ్చని పాలలో ఆముదం కలిపి తీసికొనవలెను .
* రోజూ నిద్రపోయే ముందు రాత్రి సమయములో రెండు గ్లాసుల నీరు తాగుచున్న ఉదయం సుఖవిరేచనం అగును. ఇలా తాగడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే అవ్వొచ్చు లేదా రోజూ తాగుచున్న 4 రోజుల తరవాతి నుంచి వరస క్రమంలోకి వచ్చి సాఫీగా జరుగుతుంది.
మనం తీసుకునే ఆహారంను బట్టే...
మలబద్దకం సమస్య అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. మైదా పిండికి సంబంధించిన ఆహార పదార్ధాలు ఏవి తినకూడదు. ప్రస్తుత కాలంలో జంక్ పుడ్ తీసుకోవడం ఎక్కువ అయ్యింది. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆహారం. వీలైనంత వరకు అటువంటి వాటి దూరంగా ఉండవలెను. ఋతువు మారినప్పుడల్లా కడుపును శుభ్రం చేసుకొనుటకు విరేచనం కలిగించే ఔషధాలు తీసుకొనుట అత్యంత ప్రధానం అయింది.
రోజుకు రెండు సార్లు...
చాలా మంది ఉదయాన్నే విరేచనముకు వెళ్ళి తమకు సుఖవిరేచనం అవుతుంది. అనే అపోహలో ఉంటారు. రోజుకి రెండు సార్లు విరేచనమునకు వెళ్ళినప్పుడే ఆరోగ్యకరమైన మనిషిగా భావించవలెను. మనం తీసుకునే ఆహారం కూడా మలబద్దకం సమస్య రాకుండా ప్రధానపాత్ర పోషిస్తుంది. ముఖ్యముగా నీరుని తీసుకోవడం, లేత ముల్లంగి, మునగ ఆకులు, మునగకాయ, కాకరకాయ, పొన్నగంటి కూర, ద్రాక్ష, వెల్లుల్లి, ఆవుపాలు, ఆముదము, ఉలవచారు, పాతబియ్యం, నెయ్యి, వెన్న తరచుగా ఆహారం నందు తీసుకోవాలి. పీచుపదార్ధాలు అధికముగా తీసికొనవలెను. పళ్లరసాలు కంటే పళ్లు తినటం మంచిది. శరీరము నుండి వ్యర్థపదార్థాలు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లినప్పుడే శరీరం నందు టాక్సిన్స్ పోగుపడవు. శరీరం ఆరోగ్యకరంగా ఉండును.