ఒడి బియ్యం అంటే ఏంటీ ? ఆడపడుచుకు ఎందుకు పోస్తారు ..?
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151
ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి.ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది.ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి.అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది.ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో "ఒడ్డియాన పీఠం" వుంటుంది.మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో "వడ్యాణం" అంటారు.
ఏడు చక్రాలలో శక్తి (గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడి బియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు.ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట.అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి.అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటేనే రక్షణ.
ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది.వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు.మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం.ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే.
సంతోషంతో ఆ మహాలక్ష్మి (ఆడపడుచు) తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి దేవుని ప్రార్ధించి మహాధ్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను (ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది.ఇది అత్తవారు కూడ చేయవచ్చు.అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం తెలుసుకోవడం ఇక్కడ ప్రధానం.