కోరికలు ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం అందదు
డా.ఎం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
కోరికలు ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం అందదు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యమహర్షి ఇలా అన్నాడు- "ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియ భవతి" - అన్నింటి కన్న ప్రియమైనది ఆత్మయే అని, ఎన్ని సంపదలున్నా ఆత్మ సంపదతో తులతూగలేవు.ఎన్ని జ్ఞానాలున్నా ( తెలివితేటలున్నా ) ఆత్మజ్ఞానంతో సరిరావు.
ఈ లోకంలో ఏ వస్తువును పొందినా, ఎంత ధనాన్ని సంపాదించినా, ఎందరు వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్న, అంతా ఆనందం కోసమే.కొన్ని వస్తువులను, సంపదలను, భోగాలను కోరుకొని, వాటిని పొందినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అయితే ఆయా వస్తువుల ద్వారా, భోగాల ద్వారా, సంపదల ద్వారా వచ్చిన ఆనందం అవి దూరమైపోగానే పోతుంది లేదా వాటిపై మోజు తీరగానే పోతుంది.
ఒక రాజు ఆయన వృద్ధుడై వనాలకు వెళ్ళాలనుకొని కుమారునికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఆ రాజకుమారుడు విద్యావంతుడు,పరాక్రమశాలి.యవ్వనంలో ఉన్నాడు.అందమైన, అణకువగలిగిన, గుణవంతురాలైన భార్య ఉన్నది.నమ్మకస్ధులైన మంత్రులు,సేనాధిపతులు, పరివారము ఉన్నది. అందమైన బిడ్డలున్నారు. కావలసినంత సంపద ఉన్నది. బ్రహ్మాండమైన రాజ మహలుంది ప్రజల యొక్క మన్ననలున్నాయి. శత్రుబాధలేదు. అతడికి ఏ కొరతా లేదు. ఏ కోరికా లేదు. హాయిగా ఆనందంగా ఉన్నాడు.
ఇక తండ్రి - రాజుగా ఉన్నప్పుడే సకల శాస్త్రాలు అభ్యసించాడు.జ్ఞానాన్ని పొందాడు.ఇప్పుడు వానప్రస్థాన్ని స్వీకరించి నిరంతర భగవధ్యానంతో - తపస్సుతో - బ్రహ్మజ్ఞాన సంపన్నుడయ్యాడు.ఇప్పుడాయనకు రాజ్యం లేదు భోగాలు లేదు భార్య లేదు అనుచర వర్గం లేదు సేవకులు లేరు సంపద లేదు కుటీరం కూడా లేదు సరియైన వస్త్రం కూడా లేదు శరీర స్పృహ కూడా లేదు.నిరంతరం బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉన్నాడు.
ఇప్పుడు తండ్రి - కుమారులను ఇద్దరినీ పోల్చి చూస్తే ఇద్దరూ ఆనందంగానే ఉన్నారు. అయితే ఇద్దరి ఆనందాలలో తేడా ఉన్నది. కుమారుడు అన్నీ ఉన్నాయి గనుక ఏ కోరికా లేనందున హాయిగా - ఆనందంగా ఉన్నాడు.అతడి ఆనందమంతా తనకున్న బాహ్య వస్తువుల మీద విషయాల మీద ఆధారపడి ఉన్నది. పొరుగు రాజుతో మనస్పర్ధ వచ్చింది.
దానితో భయం భార్య జబ్బు పడింది.ఆనందం పోయి విషాదం వచ్చింది. కుమారుడు దురలవాట్లకు లోనయ్యాడు.రాజ్యంలో దుర్భిక్షం ఏర్పడింది.ప్రజలు నానా అవస్ధలు పడుతూ రాజుపై క్రోధంతో ఉన్నారు. సంపదలు తరిగి పోతున్నాయి. రాజ్య విస్తరణ చేయాలనే కోరిక కలిగింది. దీనితో అతడి ఆనందం ఆవిరైపోయింది. కాని తండ్రి మాత్రం తన ఆనందంలో ఏ మార్పు లేకుండా ఉన్నాడు.
తన దేహాన్నే పట్టించుకోని వాడికి కుమారుని సంగతే తెలియదు.ఏది పొందితే ఇక పొందాల్సిందేమీ లేదో అట్టి ఆత్మను - బ్రహ్మమును పొందాడు. బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు.ఇక ఏ ఆనందం అతడికక్కరలేదు.ఏ జ్ఞానాన్ని పొందితే మరొక జ్ఞానంతో పనిలేదో అట్టి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. బ్రహ్మముగానే ఉండిపోయాడు.ఇక ఈ బ్రహ్మానందం ఎవరి చేత, దేనిచేత హరించబడేది కాదు.
దీనిలో ఇక ఏ మార్పులు ఉండవు.దేహానికైతే అనారోగ్యం, ముసలితనం వస్తుందేమో కాని తాను ఆత్మగా - బ్రహ్మంగా ఉన్నాడు గనుక ముసలితనం లేదు అనారోగ్యం లేద, మరణమూ లేదు ఏ మార్పులూ లేవు ఇక అతడికి ఏ కోరికలూ లేవు ఈ ప్రపంచమే అతడి దృష్టిలో లేదు కనుక సదానంద స్వరూపుడై ఉన్నాడు. కనుక ప్రతివారు పొందదగినది బ్రహ్మాన్నే.
ఇది
తెలియక
అజ్ఞానులు
ఇంకా
ఈ
అనిత్య
ప్రపంచంలో
దాన్ని
పొందాలని
దీన్ని
సాధించాలని
దాన్ని
అనుభవించాలని
వస్తువుల
కోసం
వ్యక్తుల
కోసం
భోగాల
కోసం
పదవుల
కోసం
కీర్తి
ప్రతిష్టల
కోసం
పుణ్యం
కోసం
ఏదేదో
ప్రయత్నాలు
చేస్తూనే
ఉంటారు.పొందుతూనే
ఉంటారు.
ఆనందించామని
అనుకుంటూనే
ఉంటారు.
అంతలోనే ఆనందం ఆవిరైపోతుంది.దుఃఖాలు ముంచుకొస్తాయి.కనుక శాశ్వత ఆనందం కొరకు మార్పులు లేని ఆనందం కొరకు - బ్రహ్మానుభూతిని చెందాలి. ఆత్మ లాభాన్ని పొందాలి.ఇదే పరమ సుఖం, పరమానందం, పరమ జ్ఞానం.ఇట్టి జ్ఞానాన్ని పొందితే ఇక పొందాల్సిందేమీ లేదు - ఉండదు.అనంత కోటి జన్మల యొక్క సాఫల్యం దీనితోనే.
"యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే ||"
(గీత 6-22)
దేనిని పొందితే దాని కన్న మించిన లాభం మరొకటి లేదో - దేని యందు స్థిరంగా కూర్చుంటే ఎటువంటి దుఃఖాలు ఇక లేనే లేవో - అని గీతలో భగవానుని వాక్యం లాంటిదే ఇక్కడ అని మనం గ్రహించాలి.