భగవంతుడి ప్రార్థనల కన్నా పరోపకారమే మిన్న ?
పరోపకారం మిధం శరీరం అన్నారు పెద్దలు వాస్తవానికి మనం భగవంతున్ని ప్రార్ధించేప్పుడు ఏదైనా కోరిక కోరితే పరిపూర్ణంగా మనకే కావాలని కోరుకుంటాము. అందరి కంటే పై స్థాయిలో మనమే ఉండాలని తహతహలాడుతాం. నిజానికి ఇలాంటి వాటికి భగవంతుడు సంతృప్తి చెందడు. ఇతరుల మేలు కోరితే మనకు మంచి జరుగుతుంది. శత్రువునికుడా మేలు జరగాలనే భావం ఉండాలి.
సిద్ధ పురుషులు తాము సాధించుకున్న లేదా సహజంగా పొందిన సిద్ధులను తమ కోసం ఎన్నడూ వాడుకోరు. మేఘం తన వద్ద ఉన్న నీటితో దాహం తీర్చుకోదు. ఆవు తన పాలను తాను తాగదు. అలాగే సిద్ధ పురుషులు కూడా తమ సంకల్పాలను, సిద్ధులను లోక కళ్యాణం కోసం, లోక శోకాన్ని తొలగించటానికి మాత్రమే వినియోగిస్తారు.
శంకర భగవత్పాదులు బాల్యంలో భిక్షాటనకు వెళ్లినపుడు ఆయనకు పెట్టడానికి ఉసిరికాయ తప్ప తన వద్ద ఏమీ లేదని ఒక నిరుపేద గృహిణి బాధపడింది. దీంతో కరుణాలయమైన శంకరుల హృదయం ఆర్ద్రమైంది. మనసు సంకల్పించింది. ఆయన అమృత వాక్ప్రవాహం సర్వైశ్వర్యదాయినియైన శ్రీమహాలక్ష్మిని అశువుగా స్తుతించారు .
శంకరులే అర్థిస్తే అమ్మ కదలదా? కరగదా? కనికరించదా? అదే జరిగింది. కనకధార సాగింది. బీద ఇల్లాలి ఇల్లు సర్వసంపదాలయమైంది. ఆమె దీనత్వం లయించింది. దివ్యత్వం పల్లవించింది. ఆనందం వెల్లివిరిసింది. ఆనాటి శంకర హృదయగీతికే ఈనాడు ఆరాధనా గీతికగా జనుల నాల్కలపై నడయాడే దివ్య గానమైంది.
శ్రీ మహాలక్ష్మిని ఎలా ప్రార్థిస్తే ఎలా అర్థిస్తే ఆ తల్లి అనుగ్రహిస్తుందో పేదరికం నశించి సంపద లభిస్తుందో సూచించే కనకధారాస్తవం దివ్య కవితా మాలికైంది. అలాగే పరుల కోసం చేసే సిద్ధ పురుషుల గొప్పదనం. పరుల కోసం చేసే ప్రార్థనలో ఉన్న గొప్పదనం. అదే అసలు ప్రార్థన. అదే శుద్ధి. అదే సిద్ది. ధనమే బలంగా మారిన ఆధునిక ప్రపంచానికి, ఆచార్య స్వామి సందేశం ఇదే.
ఏదేకాని మనతో ఉన్న జీవిస్తున్న సాటి వారి మేలు కోరే దైవత్వం మనకు అలవడాలి. మనం ఎదుటి వారికోసం చేసే మేలు తిరిగి ఎదో ఒక రూపంలో మనకే వస్తుంది. మహానుభావులు పరోపకారం కోరే మనకు ఆదర్శప్రాయులు అయినారు.