వసంత పంచమి రోజున ఏ దేవతను పూజిస్తే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది..?
వసంత పంచమిని హిందువులు ఘనంగా జరుపుకుంటారు. సరస్వతీ దేవిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయి.
శ్రీ వసంత పంచమి
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
యా
కుందేందు
తూషారహారధవళా
యాశుభ్రవ
స్త్రాన్వీతా
యావీణ
వరదండ
మండితకరా
యాశ్వేత
పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత
శంకర
ప్రభుథిభి:
దేవై:
సదా
వందితా
సామాంపాతు
సరస్వతి
భగవతీ
నిశ్శేషజాఢ్యాపహా
మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. ఈ ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి. మాఘమాసంలో ఐదవరోజున మనం జరుపుకునే పర్వదినం వసంత పంచమి. దీనినే శ్రీ పంచమి అని, సరస్వతి పంచమి అని కూడా అంటారు. ఈ సంవత్సరం వసంత పంచమి తిథి తేదీ 25 జనవరి 2023 బుధవారం మధ్యాహ్నం 12 : 34 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 26వ తేదీ గురువారం ఉదయం 10 : 28 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం ఉదయం తిథి ప్రకారమే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఈసారి వసంత పంచమిని జనవరి 26న గురువారం రోజున జరుపుకుంటారు. పూజకు అనుకూలమైన సమయం ఉదయం 7 : 07 గంటల నుండి మధ్యాహ్నం 12 : 35 గంటల వరకు
ఈ శ్రీ పంచమి రోజే చదువులతల్లి సరస్వతీ దేవి పుట్టినట్టు బ్రహ్మవైవర్త పురాణం చెపుతోంది. ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాకకోసం నేలనంతా పసుపుతో అలికాయా అనట్టుగా ఉంటుంది వాతవరణమంతా. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విధ్యావంతులు అవుతారనే నమ్మకం కూడా చాలామందికి ఉంది. అందుకే తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు చాలామంది తల్లితండ్రులు. బాసర క్షేత్రంలో ఈ ఉత్సవాన్ని మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చి ఎంతోమంది తమ పిల్లలకి అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేయించుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇళ్లలోనే కాకుండా స్కూల్స్ మరియు కాలేజీలలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు.
ఉత్తరాదిన కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు. పశ్చిమ బెంగాలులో సరస్వతి విగ్రహానికి మూడు రోజులు పూజలు చేసి ఆఖరు రోజు గోదావరి నదిలో అనుపుతారట. పంజాబ్, బీహార్ రాష్ట్రాలలో దీనిని పంతంగుల పండుగగా జరుపుకుంటారు. మనం ఇక్కడ సంక్రాంతి పండగకి ఎలాగైతే గాలి పటాలని ఎగురవేస్తామో అక్కడ ఈ శ్రీ పంచమికి అన్ని వయసులవారు గాలిపటాలని ఎగరేస్తారు. అమ్మవారికి కేసరి ప్రసాదం పెట్టటం ఇంకో విశేషం. ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాది వారు. అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించటమే కాకుండా అందరు పసుపు రంగు బట్టలే కట్టుకుంటారట. ఇంకొన్ని ప్రాంతాల్లో వసంత పంచమినే కామదేవ పంచమి అని కూడా అంటారు. రతి దేవి, కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట. అందుకే దేశం లోని కొన్ని ప్రాంతాల వారు ఈ పంచమి రోజు రంగులు జల్లుకుంటారు కూడా..
ఎన్నో ప్రాంతాలవారు అమ్మవారి అనుగ్రహం కోసం రకాలుగా పూజలు జరుపుకుంటూ ఉంటారు, ఆ చదువులతల్లి దీవెనలు అందరిని వరించాలనే కోరుకుందాం.
పూజా విధానం:-
* వసంత పంచమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పసుపు రంగులో లేదా తెలుపు రంగులో ఉండే ఉతికిన బట్టలను ధరించాలి.
* శుభ్రమైన నీటితో పూజా స్థలాన్ని లేదా పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. అనంతరం అమ్మవారి ఫొటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించి, పసుపు రంగులో ఉండే బట్టలను సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి పసుపు రంగులో ఉండే పువ్వులు, అక్షింతలు, చందనం, ధూపం, దీపం సమర్పించాలి.
* సరస్వతీ దేవికి పసుపు రంగులో ఉండే మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి.
* సరస్వతీ పూజా సమయంలో సర్వసతీ వందనం, సరస్వతీ మంత్రాలను పఠించాలి.
* వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది.
శుభ యోగాలు:- ఈసారి వసంత పంచమి పండుగ సమయంలో అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. మొత్తం నాలుగు శుభ యోగాలు ఏర్పడే ఈ సమయంలో సరస్వతీ దేవిని పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ముందుగా శివయోగం ఏర్పడనుంది. ఆ తర్వాత సిద్ధయోగం, సర్వార్ద సిద్ధయోగం, రవియోగం ఏర్పడనున్నాయి.
సరస్వతి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.
ఈ తల్లిని తెల్లని పూవులతోను, శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితోకూడిన వంటలను, నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.
'వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి' ఇలా అనేక నామాలున్నప్పటికీ '' సామాంపాతు సరస్వతీ.... '' అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట. సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించారు.