ఆంటోని నివేదిక: సీమాంధ్రుల వ్యూహం, రాజీనామాలే!
హైదరాబాద్/న్యూఢిల్లీ: విభజనపై వేసిన ఎకె ఆంటోని కమిటి నేడు కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీకి ఓ నివేదిక ఇచ్చే అవకాశమున్న నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం కోర్ కమిటీ భేటీ కానుంది. విభజనపై తాను గుర్తించిన అంశాలను ఆంటోని నివేదిక ఇచ్చే అవకాశముంది. కమిటీ సంప్రదింపుల వివరాలపై చర్చించనున్నారు.
ఆంటోని కమిటీ నివేదిక ఆధారంగానే పార్టీ ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. హోంశాఖ నోట్కు ఇదే ప్రతిపాదిక కానుంది. ఇప్పటి వరకు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలతో సమావేశమై వివరాలు సేకరించిన ఆంటోని... కోర్ కమిటి ముందు వాటిని వెల్లడించనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై హోంశాఖ రూపొందించే కేబినెట్ నోట్కు తుది మెరుగులు దిద్దటంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషించనుంది.
ఆంటోనీ కమిటీ నివేదిక, కేబినెట్ నోట్ నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులు విభజన నిర్ణయాన్ని ఆపేందుకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. కేబినెట్ నోట్ వస్తే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. ఇందు కోసం అందరితో చర్చలు జరుపుతున్నారు. విభజనపై అధిష్టానం దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో మరింత ఒత్తిడి తీసుకు రావాల్సి ఉందని వారు భావిస్తున్నారు.
ఇందుకోసం అవసరమైతే అందరు కలిసి రాజీనామాలు సమర్పించాలని భావిస్తున్నారు. వీటిపై చర్చిస్తున్నారు. కాగా, విభజన జరిగితే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు విజయవాడలో అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏ నాయకుడి ప్రభావం లేదన్నారు.