RBI డిప్యూటీ గవర్నర్ పదవి: 10 మందితో షార్ట్ లిస్ట్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ పదవి కోసం గత వారంలో పదిమందిని ఇంటర్వ్యూ చేశారట. అంతకుముందు విరల్ ఆచార్య డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. 20 జనవరి 2016 నుంచి కొద్ది నెలల క్రితం వరకు ఆయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పని చేశారు. తన పదవీకాలం ముగియనున్న ఆరు నెలలకు ముందు ఆయన రాజీనామా చేశారు. ఆ స్థానాన్ని భర్తి చేసేందుకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.
3 నెలల్లో రూ.218 కోట్ల లాభాలు ఆర్జించిన గల్లా జయదేవ్ కంపెనీ
ఈ పదవి కోసం గత వారం పదిమందిని ఇంటర్వ్యూ చేసినట్లుగా తెలుస్తోంది. ఫైనాన్షియల్ సెక్రటరీ రెగ్యులేటరి అపాయింటుమెంట్ సెర్చ్ కమిటీ (FSRASC) ఈ ఇంటర్వ్యూలను నిర్వహించింది. నియామకంపై తుది నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం తీసుకుంటుంది. విరల్ ఆచార్య రాజీనామా చేసిన అనంతరం, ఆగస్ట్ నెల నుంచి డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది.
ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు... పదిమందితో షార్ట్ లిస్ట్ తయారయింది. ఇందులో చేతన్ ఘట్కే (ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్), అరునీష్ చావ్లా (డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ జాయింట్ సెక్రటరీ), మనోజ్ గోవిల్ (ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వయిజర్), టీవీ సోమనాథన్ (అడిషనల్ చీఫ్ సెక్రటరీ, తమిళనాడు), మైఖేల్ పాత్ర (ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), ప్రాచి మిశ్రా (గోల్డ్మన్ శాక్స్ ఎకనమిస్ట్) తదితరులు ఉన్నారు. ఘట్కే, పాత్రాలు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లలో సభ్యులుగా పాల్గొన్నవారు.
షార్ట్ లిస్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం.. కమిటీ రికమెండేషన్ ఆధారంగా డిప్యూటీ గవర్నర్ను అపాయింట్ చేస్తుంది. ఈ కమిటీలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఉంటారు. డిప్యూటీ గవర్నర్ పదవికి దరఖాస్తు చేసుకోని వారిని కూడా రికమెండ్ చేసే స్వేచ్ఛ FSRASCకు ఉంది.
ప్రస్తుతం ఆర్బీఐలో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు. ఎన్ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్ ఉన్నారు. యంగెస్ట్ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య పదవీకాలం 2020 జనవరిలో ముగియనుండగా, ఆరు నెలల ముందే పదవి వదిలి, న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు వెళ్లారు.