బిసిసిఐ పై అజరుద్దీన్ రణభేరి
హైదరాబాద్ఃమ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన అభియోగంపై బిసిసిఐ తనకు జీవితకాల నిషేధాన్ని విధించడాన్ని భారతక్రికెట్ మాజీ కెప్టెన్ అజరుద్దీన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేయనున్నారు. ఈ విషయాన్ని అజరుద్దీన్ న్యాయవాది హంసరాజ్ భరద్వాజ్ సోమవారం వెల్లడించారు. మ్యాచ్ ఫిక్సింగ్ పై బిసిసిఐ నివేదిక తప్పుల తడక అని అజరుద్దీన్ విరుచుకుపడ్డారు.
అసలు మాధవన్ ను బిసిసిఐ విచారణాధికారిగా నియమించడం చట్టబద్ధం కాదని కూడా అజర్ న్యాయస్థానంలో సవాలు చేయనున్నారు. ముంబయ్ కు చెందిన మాజీ క్రికెటర్లను కనీసం విచారించకుండా ఎలా వదిలేశారని అజరుద్దీన్ ప్రశ్నించనున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జీవితకాల నిషేధం విధించిన తరువాత చాలాకాలం అజర్ నోరుమెదపని విషయం విదితమే. కొద్ది రోజుల క్రితమే అజర్ మొట్టమొదటి సారిగా విలేకరుల సమావేశంలో తనకు ఘోరమైన అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
సునీల్ గవాస్కర్ లాకర్ లో నోట్ల కట్టలు దొరికినా, రవిశాస్త్రికి చెందిన గార్డెన్ పై అనేక ఆరోపణలు వున్నా వానిటి ఎందుకు పట్టించుకోలేదని ఆయన బిసిసిఐ ని సవాల్ చేశాడు. బిసిసిఐ ఒక వర్గం కొమ్ము కాస్తున్నదంటూ అజర్ ధ్వజమెత్తారు. చివరకు ఔట్ లుక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ టెండుల్కర్ పై కూడా అజర్ విమర్శలు చేశాడు. ఇంతకాలం కడుపులో దాచుకున్న అక్కసునంతా అజరుద్దీన్ ఒక్కసారిగా వెళ్ళగక్కాడు. బిసిసిఐ న్యాయపోరాటం చేయాలనుకోవడం, అందుకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును వేదికగా ఎంచుకోవడం అజర్ కు ఎంత వరకు లాభిస్తుందో వేచి చూడాల్సిందే.